పుష్ప, సింగమ్ల అవసరం లేదంటూ ప్రత్యేక కోర్టు వ్యాఖ్య
న్యూఢిల్లీ: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కాల్పులు జరిపి ఒకరి మృతికి కారణమైన బిహార్ బీజేపీ ఎమ్మెల్యే రాజు కుమార్ సింగ్కి ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.25 లక్షల జరిమానా విధించింది. చట్టపాలన నడిచే మన దేశంలో పుష్ప, సింగమ్ల వంటి వారితో పని లేదంటూ స్పెషల్ కోర్టు విశాల్ గొగ్నె వ్యాఖ్యానించారు. ‘అధికారముందనే అహంకారంతో మద్యం మత్తులో తన హోదాను ప్రదర్శించుకునేందుకు కాల్పులు జరిపినట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో ఉదాసీనత చూపితే అక్రమ ఆయుధాల దందా మొదలై రాజకీయాల్లోకి బాహుబలులు ప్రవేశిస్తారు. చట్టపాలన నడిచే చోట పుష్ప, సింగమ్ల వంటి వారితో అవసరం లేదు. దోషి రాజు కుమార్ సింగ్ బరితెగింపు చర్య మిగతా వారిని ప్రేరేపించేలా ఉంది’అని ఆయన వ్యాఖ్యానించారు.
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రాజు సింగ్.. వేడుక సమయంలో చుట్టూ జనం ఉన్నారన్న విషయాన్ని, వారిలో సొంత కుటుంబీకులున్న విషయాన్ని సైతం విస్మరించి, నిర్లక్ష్యంగా, నేరపూరితంగా వ్యవహరించారని జడ్జి విశాల్ పేర్కొన్నారు. నివాసంలో వివిధ రకాల మారణాయుధాలు, బుల్లెట్లు లభించడాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ఆయనకు ప్రొబేషన్ను నిరాకరిస్తున్నట్లు తీర్పులో స్పష్టం చేశారు.
జరిమానాతో ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేమంటూ జడ్జి విశాల్..వివిధ వ్యాపారాలతో భారీగా ఆదాయం పొందే రాజు సింగ్ బాధితురాలి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. 2018 డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఫతేపూర్ బేరిలోని ఓ ఫాంహౌస్లో ఎమ్మెల్యే రాజు కుమార్ సింగ్ నూతన సంవత్సర వేడుకలు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆహ్వనంపై అర్చనా గుప్తా, ఆమె భర్త, పిల్లలు హాజరయ్యారు. నూతన సంవత్సరంలోకి ప్రవేశించిన గుర్తుగా ఎమ్మెల్యే సింగ్ తన చేతిలోని తుపాకీని పలుమార్లు కాల్చారు. అయితే, బుల్లెట్లు తగిలి అర్చనా గుప్తా(45) ప్రాణాలు కోల్పోయారు.


