టోక్యో: ఆసియా దేశాలు పునర్వినియోగ రాకెట్లను పోటాపోటీగా అభివృద్ధి చేస్తున్నాయి. చైనా ఈ దిశగా ఒక ప్రయోగాన్ని విజయవంతం చేసి 24 గంటలు కూడా గడవక ముందే జపాన్ కూడా తొలి పరీక్షలో సక్సెస్ నమోదు చేసింది. అంతరిక్ష ప్రయోగాల ఖర్చును గణనీయంగా తగ్గించుకునేందుకు ఈ రంగంలో స్పేస్ ఎక్స్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకూ పునర్వినియోగ రాకెట్లు ఉపయోగపడతాయని జపాన్ అంచనా.
ఆర్వీ–ఎక్స్ పేరుతో జపాన్ అభివృద్ధి చేసిన పునర్వినియోగ రాకెట్ శనివారం ఒకే ఒక్క నిమిషం పాటు గాల్లోకి ఎగిరి కొంత పక్కకు జరిగి ల్యాండైంది. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీకి సంబంధించిన నోషిరో టెస్టింగ్ సెంటర్లో జరిగిన ఈ ప్రయోగాన్ని ఎన్వీఎస్ సంస్థ ప్రత్యక్ష ప్రసారం చేయడం గమనార్హం. జపాన్ అంతరిక్ష ప్రయోగాలకు చాలా కాలంగా ఒకేసారి వాడగలిగే హెచ్–3 శ్రేణి రాకెట్లను వాడుతున్న విషయం తెలిసిందే.
అంతకంటే మునుపు వాడిన హెచ్2ఏ శ్రేణి రాకెట్ల కంటే ఇది చౌక అయినప్పటికీ అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగాల మార్కెట్లో పోటీకి ఖర్చులు మరింత తగ్గాల్సి ఉంటుంది. జాతీయ భద్రతకు ఇది అత్యవసరమని జపాన్ భావిస్తోంది. జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ జాక్సా, మిత్సుబుషి హెవీ ఇండస్ట్రీస్లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ ఆర్వీ–ఎక్స్ రాకెట్ సుమారు 23.9 అడుగుల ఎత్తు, ఆరు అడుగుల వ్యాసం కలిగి ఉంది. అత్యాధునిక ఇంజిన్లు, నాలుగు షాక్ అబ్జార్బర్లతో కూడిన ల్యాండింగ్ గేర్ దీని ప్రత్యేకతలు. పునర్వినియోగ రాకెట్ల అభివృద్ధిలో జాక్సా ఫ్రాన్స్, జర్మనీల సాయం కూడా తీసుకుంటోంది.


