శాన్ఫ్రాన్సిస్కో: పబ్లిక్ ఇన్స్టాగ్రామ్ చిత్రాలను ఆటోమేటిక్గా యాక్సెస్ చేసే కృత్రిమ మేధ(ఏఐ) టూల్లోని ఒక ఫీచర్ను ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్ల మాతృసంస్థ ‘మెటా’ నిలిపివేసింది. ఏఐతో చిత్రాలను సృష్టించడానికి ప్రజల ఇన్స్టాగ్రామ్ ఖాతాలను ఒక ముడిసరుకుగా వాడుకుంటోందని ఆ సంస్థపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రజలకు ఉపయోగకరమైన ఒక సృజనాత్మక సాధనాన్ని అందించడం, అలాగే వారి పబ్లిక్ కంటెంట్ను ఈ విధంగా వాడుకోవచ్చా లేదా అనే దానిపై అందరికీ అవగాహన కల్పించడమే తమ ఉద్దేశమని మెటా ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ కొత్త ఫీచర్ ఆశించిన స్థాయిలో లేదని అభిప్రాయం రావడంతో దీనిని ఇకపై అందుబాటులో ఉంచడం లేదని పేర్కొంది. మెటా సంస్థ వారం రోజుల క్రితం ‘మ్యూజ్ ఇమేజ్’ పేరిట కొత్త ఏఐ టూల్ను తీసుకొచ్చింది. చిత్రాలను రూపొందించే సామర్థ్యం ఉన్న ఇతర ఏఐ యాప్ల మాదిరిగానే మ్యూజ్ ఇమేజ్ వినియోగదారుల సూచనల ఆధారంగా చిత్రాలను సృష్టిస్తుంది. కొత్త చిత్రాలను సృష్టించేటప్పుడు రిఫరెన్స్గా ఉపయోగపడటానికి అన్ని పబ్లిక్ ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్ట్ చేసిన ఫొటోలను ఈ టూల్ స్వయంచాలకంగా ఉపయోగించుకునేలా రూపొందించారు. ఇది ప్రజల గోప్యతకు భంగం కలిగిస్తోందని ఆరోపణలు వచ్చాయి.


