సాక్షి,నెల్లూరు: నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెంలో సీఎం చంద్రబాబు పాల్గొన్న ప్రజావేదిక సభలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటీవల ఓ ప్రైవేట్ పాఠశాలలో తౌశిక్ అనే విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. తన కుమారుడి మరణానికి న్యాయం చేయాలంటూ సీఎం సభ వద్దకు చేరుకోవడంతో ఈ కలకలం రేగింది. చంద్రబాబుకు వినతిపత్రం అందజేసేందుకు ప్రయత్నించిన బాధిత తండ్రి పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించడం స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది.
నెల్లూరులోని ఒక ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలో ఇటీవల తౌశిక్ అనే విద్యార్థి మరణించాడు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం,అనుమానాస్పద పరిస్థితులే తన కుమారుడి మృతికి కారణమని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని అతని తండ్రి కోరుతున్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు తన గోడును వెళ్లబోసుకుని, వినతిపత్రం సమర్పిస్తే న్యాయం జరుగుతుందనే ఆశతో ఆయన సభా ప్రాంగణానికి వచ్చారు.
సీఎం చంద్రబాబుకు కేవలం వినతిపత్రం మాత్రమే ఇస్తానని, దయచేసి అనుమతించాలని బాధిత తండ్రి అక్కడున్న పోలీసులను వేడుకున్నారు. అయితే, భద్రతా కారణాల నెపంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఆయనను సభా ప్రాంగణం నుంచి బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనంలో అక్కడి నుండి తరలించారు.కన్నకొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తండ్రి అని కూడా చూడకుండా పోలీసులు వ్యవహరించిన తీరుపై సభకు వచ్చిన పార్టీ కార్యకర్తలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకుని, బాధిత కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


