తాడేపల్లి : ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్ వేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు.. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. వైఎస్సార్సీపీ తరుఫున శాసన మండలి డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి ముందు వైఎస్ జగన్ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు తుమాటి మాధవరావు.
రేపు రాజమండ్రి రూరల్ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
రేపు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. ప్రజా సమస్యలు, సంస్థాగత అంశాలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై వీరితో వైఎస్ జగన్ చర్చించనున్నారు.
వైఎస్ జగన్ను కలిసిన కేసీ కెనాల్ రైతులు
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటి విడుదల చేయకపోవటంపై ఆందోళన వ్యక్తం చేసిన కేసీ కెనాల్ రైతులు.. వైఎస్ జగన్ను కలిశారు. రైతులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడంపై వైఎస్ జగన్ వద్ద వారు ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వాయరులో 878 అడుగుల నీరు ఉన్నా సాగునీరు విడుదల చేయటం లేదంటూ ఫిర్యాదు చేశారు. మీ హయాంలో 854 అడుగుల నీటిమట్టం ఉన్నా నీటిని విడుదల చేశారంటూ వైఎస్ జగన్కు గుర్తు చేశారు రైతులు.


