సాక్షి,వైఎస్సార్: జిల్లాలో నెలల తరబడి పెండింగ్లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను రైతులకు వెంటనే మంజూరు చేయాలని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లాలో విద్యుత్ పరికరాల కొరత, పెండింగ్ కనెక్షన్ల సమస్యపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్కు ఎంపీ లేఖ రాశారు. అనంతరం వారితో ఫోన్లో మాట్లాడి జిల్లాలోని పరిస్థితులను వివరించారు.
గత రెండేళ్లుగా జిల్లాలో రైతులకు కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకపోవడంతో వారు సాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ అవినాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 1,800 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు నెలల తరబడి పెండింగ్లోనే ఉండిపోయాయని ఆయన వెల్లడించారు.
కనెక్షన్ల మంజూరుకు ప్రధాన అవరోధంగా మారిన విద్యుత్ పరికరాల కొరతను అధిగమించాలని ఆయన కోరారు.పెండింగ్ కనెక్షన్లను క్లియర్ చేయడానికి అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, కండక్టర్లను వెంటనే విడుదల చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ యాజమాన్యానికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.


