భువనేశ్వర్: ఒడిశాలో ఐదో తరగతి ఇంగ్లీష్ పాఠ్యపుస్తకంలో ఒక బాలీవుడ్ పాట ముద్రితం కావడం వివాదానికి దారితీసింది. 1999లో వచ్చిన ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ చిత్రంలోని ‘నింబుడ నింబుడ’ అనే హిందీ పాట లిరిక్స్ పుస్తకంలో ప్రచురితమయ్యాయి. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, చాలా మంది దీనిపై మీమ్స్తో హాస్యాన్ని పండిస్తే, మరికొందరు పాఠ్యపుస్తకాల నాణ్యత పరిశీలనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వివాదంపై ఒడిశా పాఠశాల, ప్రజా విద్యాశాఖ మంత్రి నిత్యానంద గొండ్ స్పందిస్తూ, ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఈ పాఠ్యపుస్తకాల తప్పులపై సమగ్ర విచారణకు ఆదేశించారని, ఇందుకు ఒక విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయని, సవరించిన కొత్త పుస్తకాలను పాఠశాలలకు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు.
ఇటీవలే ఒకటి నుండి ఎనిమిది తరగతుల ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో స్పెల్లింగ్ తప్పులు, ప్రముఖుల పేర్లు తప్పుగా ముద్రించడం వంటి దాదాపు 1600 లోపాలు ఉన్నట్లు ఉపాధ్యాయులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అప్పటి టీచర్స్ ట్రైనింగ్ అండ్ ఎస్సీఆర్ఈటీ డైరెక్టర్ మనోజ్ పాఢీతో పాటు ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్లను సస్పెండ్ చేశారు. ప్రాథమిక పాఠశాల పుస్తకాలను ప్రచురించే ముందు పలు దశల్లో క్షుణ్ణంగా పరిశీలించాలని, ఇలాంటి తప్పులు పిల్లల చదువును దెబ్బతీస్తాయని విద్యా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


