'ఇది మాకు గుణ‌పాఠం.. ఓట‌మికి కారణం అదే' | Shreyas Iyer Comments-We-Failed-All Categories-Lost T20 Series-ENG | Sakshi
Sakshi News home page

'ఇది మాకు గుణ‌పాఠం.. ఓట‌మికి కారణం అదే'

Jul 12 2026 7:05 AM | Updated on Jul 12 2026 8:03 AM

Shreyas Iyer Comments-We-Failed-All Categories-Lost T20 Series-ENG

ఐర్లాండ్ టూర్‌లో 0-2తో క్లీన్‌స్వీప్ అయిన‌ టీమిండియా ఇంగ్లండ్ టూర్‌లోనూ అదే కంటిన్యూ చేసింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-4తో ఇంగ్లండ్‌కు అప్ప‌జెప్పి దారుణ ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది. శ‌నివారం రాత్రి జ‌రిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 56 ప‌రుగుల తేడాతో భార‌త్‌ను ఓడించింది. 

సూర్య‌కుమార్ యాద‌వ్ స్థానంలో టీమిండియా టీ20 కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు ఇది వ‌రుస‌గా ఏడు మ్యాచ్‌ల్లో ఆరో ఓట‌మి (ఒక మ్యాచ్ వ‌ర్షంతో ర‌ద్దు) కావ‌డం  గ‌మ‌నార్హం. ఏడు మ్యాచ్‌లుగా గెలుపు మొహం చూడ‌ని శ్రేయ‌స్ అయ్యర్‌ టీమిండియా త‌ర‌ఫున‌ అత్యంత చెత్త కెప్టెన్‌గా రికార్డుల‌కెక్కాడు. 

మ్యాచ్ ఓట‌మి అనంత‌రం మాట్లాడిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. ఇంగ్లండ్‌తో సిరీస్ ఓట‌మి త‌మకు ఒక గుణ‌పాఠం లాంటిద‌ని పేర్కొన్నాడు. బ్యాటింగ్‌లో రాణించిన‌ప్పటికీ పేల‌వ ఫీల్డింగ్‌తో పాటు నాణ్య‌త లేని బౌలింగ్ జ‌ట్టు ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణాలుగా నిలిచాయ‌ని తెలిపాడు. అయ్య‌ర్ మాట్లాడుతూ.. 'నిజాయితీగా చెప్పాలంటే ఇంకా మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది.  ఇంగ్లండ్ ప‌రిస్థితుల‌కు ఇప్పుడిప్పుడే అల‌వాటు ప‌డుతున్నాం. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మేము ఆడిన ప్ర‌తి మైదానంతో పోలిస్తే మేము ఆడిన వికెట్ల‌లో ఇదే బ‌హుశా అత్యుత్త‌మ‌మైన‌ది కావొచ్చు. 

మ్యాచ్ మ్యాచ్‌కు ప‌రిస్థితులు మారిపోతున్నాయి. తొలుత ఇంగ్లండ్ గ‌డ్డ‌పై బ్యాటింగ్ చేయ‌డానికే చాలా క‌ష్ట‌ప‌డ్డాం. కానీ ఇవాళ్టి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో చాలా మెరుగ‌య్యామ‌నిపించింది. ప్రొఫెష‌న‌ల్ ఆట‌లో ఓట‌ములు స‌హజమే. కానీ ఈ సిరీస్ ఓట‌మి మాకు గుణ‌పాఠం లాంటిది. మ్యాచ్‌లు గెల‌వ‌డంలో ఫీల్డింగ్ కూడా కీల‌క‌పాత్ర పోషిస్తుంది. 

నేటి మ్యాచ్‌లో మూడు క్యాచ్‌లు జార‌విడ‌వ‌డంతో పాటు పేల‌వంగా ఫీల్డింగ్ చేశాము. 200-210 ప‌రుగుల టార్గెట్‌ను ఈ గ్రౌండ్‌లో ఈజీగా ఛేదించ‌వ‌చ్చు. 200 నుంచి 225 ప‌రుగులు చేయాల్సిన ఇంగ్లండ్ మా త‌ప్పిదాల వ‌ల్ల మ‌రో 25 నుంచి 30 ప‌రుగులు అద‌నంగా రాబ‌ట్టింది. పేల‌వ ఫీల్డింగ్‌తో మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చింది. ఇక బ్యాటింగ్ స‌మ‌యంలో ప‌వ‌ర్ ప్లేలో వెనువెంట‌నే వికెట్లు కోల్పోవడం కూడా విజ‌యాన్ని దూరం చేసిన‌ట్ల‌యింది. 

మంచి భాగ‌స్వామ్యాలు న‌మోదు చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యాం. బౌలింగ్ కూడా మెరుగుప‌డాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. బుమ్రా, పాండ్యా వంటి అనుభ‌వ‌జ్ఞ‌లైన బౌల‌ర్లు లేని లోటు స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇక ఇంగ్లండ్ మ్యాచ్ విజ‌యానికి అర్హులు. మొద‌ట బ‌ట్ల‌ర్‌.. ఆ త‌ర్వాత కెప్టెన్ హ్యారీ బ్రూక్ వేగంగా ఆడి మ్యాచ్ గ‌మ‌నాన్ని మార్చేశాడు. ఏది ఏమైనా ఈ సిరీస్ ఓట‌మి మాకు  గుణ‌పాఠం లాంటిది. ఇంగ్లండ్ గ‌డ్డ‌పై మ‌రోసారి టీ20 సిరీస్ ఆడేందుకు వ‌చ్చిన‌ప్పుడు మా కుర్రాళ్లు జాగ్ర‌త్త‌గా ఆడతార‌ని నేను అనుకుంటున్నా. కెప్టెన్‌గా సిరీస్ ఓట‌మి నాకు బాధ క‌లిగించింది. కానీ కెప్టెన్‌గా మాత్రం చాలా విష‌యాలు నేర్చుకున్నా.' అని ముగించాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్‌ (64 బంతుల్లో 131; 12 ఫోర్లు, 8 సిక్స్‌లు) టీ20ల్లో రెండో సెంచరీతో చెలరేగగా...కెప్టెన్ హ్యారీ బ్రూక్‌ (45 బంతుల్లో 95 నాటౌట్‌; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు) త్రుటిలో ఆ అవకాశాన్ని కోల్పోయాడు.  అనంతరం భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (35 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్‌ వర్మ (25 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. 

శ్రేయస్‌ అయ్యర్‌ (16 బంతుల్లో 28; 4 ఫోర్లు), సంజు సామ్సన్‌ (14 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు.  ఇప్పటి వరకు ఐసీసీ టి20 టీమ్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్న భారత్‌ను వెనక్కి నెట్టి తాజా ఫలితంతో ఇంగ్లండ్‌ అగ్రస్థానానికి చేరుకుంది. ఇరుజ‌ట్ల మ‌ధ్య మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ జూలై 14న ప్రారంభం కానుంది.

చదవండి: ఫిఫా ప్రపంచ కప్: ఇంగ్లండ్‌ సెమీస్‌కి.. నార్వే ఇంటికి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement