ఐదు వికెట్లతో సత్తా చాటిన పేసర్
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 170 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్ 154/1
స్మృతి మంధాన అజేయ అర్ధశతకం
269 పరుగుల ఆధిక్యంలో టీమిండియా
లండన్: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మహిళల తొలి టెస్టులో భారత జట్టు అదరగొడుతోంది. ఇటీవల టి20 ప్రపంచకప్లో పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా... ఇంగ్లండ్తో ఏకైక టెస్టులో సమష్టిగా సత్తాచాటుతోంది. 142 ఏళ్ల చరిత్ర గల లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో ఇదే తొలి మహిళల టెస్టు మ్యాచ్ కాగా... చారిత్రక మ్యాచ్లో టీమిండియా దుమ్ము రేపుతోంది. ఓవర్నైట్ స్కోరు 21/1తో శనివారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ చివరకు 59.1 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది.
ఎమీ జోన్స్ (62 బంతుల్లో 52; 6 ఫోర్లు) అర్ధ శతకం సాధించగా... కెప్టెన్ సివర్ బ్రంట్ (85 బంతుల్లో 44; 4 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించింది. భారత బౌలర్లలో యువ పేసర్ క్రాంతి గౌడ్ 37 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా... సయాలి సత్గరే, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్... రెండో రోజు ఆట నిలిచిపోయే సమయానికి 42 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 154 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (124 బంతుల్లో 69 బ్యాటింగ్; 9 ఫోర్లు, 1 సిక్స్), యస్తిక భాటియా (73 బంతుల్లో 39 బ్యాటింగ్; 4 ఫోర్లు) రాణించారు. చేతిలో 9 వికెట్లు ఉన్న భారత జట్టు... ప్రస్తుతం 269 పరుగుల ఆధిక్యంలో ఉంది.
పాంచ్ పటాకా...
సొంతగడ్డపై అనుకూల వాతావరణంలో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ జట్టు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. క్రాంతి ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. మైయా (23), హీతర్ నైట్ (6), కాప్సీ (9) ఒకరి వెంటక ఒకరు పెవిలియన్కు చేరడంతో ఇంగ్లండ్ 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ సివర్ బ్రంట్తో కలిసి అమీ జోన్స్ వికెట్ల పతనాన్ని అడ్డుకుంది.
బ్రంట్ క్రీజులో పాతుకుపోవడానికి ప్రయత్నిస్తే... జోన్స్ వేగంగా పరుగులు రాబట్టింది. ఈ క్రమంలో జోన్స్ అర్ధశతకం పూర్తి చేసుకుంది. ఐదో వికెట్కు 119 బంతుల్లో 84 పరుగులు జోడించిన అనంతరం జోన్స్ అవుటైంది. ఇక అక్కడి నుంచి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కుప్పకూలింది. ఫలితంగా భారత జట్టుకు 115 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
స్మృతి సూపర్...
తొలి ఇన్నింగ్స్లో భారీ అర్ధశతకంతో రాణించిన ఓపెనర్ స్మృతి మంధాన... రెండో ఇన్నింగ్స్లోనూ అదే ఫామ్ కొనసాగించింది. ప్రత్యర్థి బౌలర్లు పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోవడంతో స్మృతి ఆడుతూ పాడుతూ ముందుకు సాగింది. మరో ఎండ్ నుంచి షఫాలీ వర్మ (55 బంతుల్లో 33; 7 ఫోర్లు) కూడా చక్కటి షాట్లు ఆడటంతో భారత జట్టు చకచకా పరుగులు రాబట్టింది. తొలి వికెట్కు 88 పరుగులు జోడించిన అనంతరం షఫాలీ అవుట్ కాగా... క్లాసిక్ షాట్లతో ఆకట్టుకున్న మంధాన 89 బంతుల్లో హాఫ్సెంచరీ పూర్తి చేసుకుంది. షఫాలీ వెనుదిరిగిన అనంతరం క్రీజులోకి వచ్చిన యస్తిక భాటియా కూడా స్మృతికి అండగా నిలవడంతో భారత జట్టుకు ఇబ్బందులు ఎదురు కాలేదు.
స్కోరు వివరాలు
భారత మహిళల తొలి ఇన్నింగ్స్: 285; ఇంగ్లండ్ మహిళల తొలి ఇన్నింగ్స్: మైయా (బి) యస్తికా (బి) క్రాంతి 23; బ్యూమాంట్ (ఎల్బీ) (బి) క్రాంతి 2; నైట్ (ఎల్బీ) (బి) సయాలీ 6; సీవర్ (ఎల్బీ) (బి) క్రాంతి 44; కాప్సీ (బి) క్రాంతి 9; జోన్స్ (సి) రిచా (బి) స్నేహ్ 52; మ్యాడీ (బి) స్నేహ్ 10; ఎకిల్స్టోన్ (సి) యస్తిక (బి) సయాలీ 11; ఇస్సీ వాంగ్ (నాటౌట్) 7; లారెన్ బెల్ (సి) షఫాలీ (బి) క్రాంతి 3; ఫిలెర్ (ఎల్బీ) (బి) దీప్తి 0; ఎక్స్ట్రాలు 3; మొత్తం (59.1 ఓవర్లలో ఆలౌట్) 170. వికెట్ల పతనం: 1–9, 2–32, 3–32, 4–47, 5–131, 6–142, 7–159, 8–159, 9–162, 10–170. బౌలింగ్: సయాలీ 13–3–40–2; క్రాంతి 17–7–37–5; స్నేహ్ 14–3–41–2; శ్రీచరణి 8–0–41–0; దీప్తి 7.1–2–10–1.
భారత మహిళల రెండో ఇన్నింగ్స్: స్మృతి (నాటౌట్) 69; షఫాలీ (సి) (సబ్) లాంబ్ (బి) ఎకిల్స్టోన్ 33; యస్తిక (నాటౌట్) 39; ఎక్స్ట్రాలు 13; మొత్తం (42 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి) 154. వికెట్ల పతనం: 1–88. బౌలింగ్: లౌరెన్ బెల్ 11–5–16–0; ఫిలెర్ 4–1–19–0; ఎకిల్స్టోన్ 12–1–46–1; ఇస్సీ వాంగ్ 7–3–30–0; మ్యాడీ 8–0–31–0.


