ఇంగ్లండ్ టెస్టు జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి బ్రెండన్ మెకల్లమ్ తప్పుకున్నాడు. 2022 నుంచి బెన్ స్టోక్స్తో కలిసి ఇంగ్లండ్ టెస్టు క్రికెట్కు కొత్త దిశానిర్దేశం చేసిన అతడు.. యాషెస్ వైఫల్యం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే మెక్కల్లమ్ వైట్బాల్ జట్లకు మాత్రం హెడ్ కోచ్గా కొనసాగనున్నాడు.
2022లో టెస్టు హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన మెకల్లమ్, అప్పటి కెప్టెన్ బెన్ స్టోక్స్తో కలిసి దూకుడైన ఆటతీరుకు శ్రీకారం చుట్టాడు. ఈ శైలికి 'బజ్బాల్' అనే పేరు పెట్టారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. 2024లో మెక్కల్లమ్కు వైట్బాల్ జట్ల బాధ్యతలు కూడా అప్పగించారు. అప్పటి నుంచి అతడు ఇంగ్లండ్ ఆల్ ఫార్మాట్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు.
ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్ 1-4 తేడాతో ఓటమి పాలవడం, ఆ తర్వాత బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈసీబీ ఒత్తిడి మేరకు మెక్కల్లమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది యాషెస్ను దృష్టిలో పెట్టుకుని టెస్టు జట్టుకు కొత్త కోచ్ను నియమించాలని ఈసీబీ భావిస్తోంది.
మెకల్లమ్ మార్గదర్శకత్వంలో ఇంగ్లండ్ టెస్టు జట్టు ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించింది. జట్టు ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చిన కోచ్గా ఆయన ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోతారు.
మెకల్లమ్ మార్గదర్శకత్వంలో, హ్యారీ బ్రూక్ నాయకత్వంలోని ఇంగ్లండ్ ఇటీవల టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరడమే కాకుండా, తాజాగా భారత్పై 4-0తో టీ20 సిరీస్ను కైవసం చేసుకుని ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకుంది.


