టీమిండియా ఫాస్ట్ బౌలర్లు ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్లకు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఇద్దరు క్రికెటర్లను బీహార్ ప్రభుత్వం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) హోదాతో సత్కరించింది. పాట్నాలోని 'ఎనర్జీ ఆడిటోరియం'లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి వీరిద్దరికీ నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా వారిద్దరూ అంతర్జాతీయ స్ధాయిలో బీహార్కు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారని సమ్రాట్ చౌదరి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్, క్రీడా శాఖ మంత్రి శ్రేయసి సింగ్లు కూడా పాల్గొన్నారు. కాగా ముకేష్, ఆకాష్ దీప్ బీహార్లో జన్మించినప్పటికి దేశవాళీ క్రికెట్లో మాత్రం బెంగాల్కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ముఖేష్ కుమార్ 2023లో వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు. ఇదే టూర్లో మొత్తం మూడు ఫార్మాట్లలోనూ డెబ్యూ చేశాడు. అయితే అతడు నిలకడగా రాణించకపోవడంతో జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు.
కానీ దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్లో మాత్రం ఫర్వాలేదన్పిస్తున్నాడు. అతడు ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 10 మ్యాచ్లు ఆడి 6 వికెట్లు పడగొట్టాడు. ఇక ఆకాష్దీప్ విషయానికి వస్తే.. అతడు భారత టెస్ట్ జట్టులో కీలక సభ్యునిగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడతుండంతో ఆకాష్ పోటీ క్రికెట్ దూరం కానున్నాడు. ఈ గాయం కారణంగా ఐపీఎల్-2026 నుంచి కూడా అతడు వైదొలిగాడు.
క్రీడకారులకు అండగా బీహార్
కాగా గత కాలంగా బీహార్ ప్రభుత్వం క్రీడకారులకు అండగా ఉంటుంది. ఇప్పటివరకు క్రీడా కోటా కింద దాదాపు 180 మంది అథ్లెట్లకు వేర్వేరు ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలు కల్పించింది. సమ్రాట్ చౌదరి సర్కార్ ఈ ఏడాది 637 మందికి స్కాలర్షిప్లతో పాటు 'సక్షమ్' పథకం కింద ₹3 లక్షలు, 'ఉత్కర్ష్' పథకం కింద ₹5 లక్షల నుండి ₹20 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు.


