బిహార్‌లో ప్రమాదం.. 40 మందితో వెళుతున్న పడవ బోల్తా | Boat carrying 40 people capsizes in Bihar | Sakshi
Sakshi News home page

బిహార్‌లో ప్రమాదం.. 40 మందితో వెళుతున్న పడవ బోల్తా

Jul 19 2026 9:12 PM | Updated on Jul 19 2026 9:18 PM

Boat carrying 40 people capsizes in Bihar

పాట్నా: బిహార్‌లోని సీతామర్హి జిల్లాలో  ఘెర ప్రమాదం జరిగింది. బాగ్‌మతి నదిలో దాదాపు 40 మందితో ప్రయాణిస్తున్న ఓ పడవ బరువు తట్టుకోలేక నదిలో బోల్తాపడింది. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి నదిలో పడ్డవారిని రక్షించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బాగ్‌మతి నదికి ఇరువైపులా ఉన్న గ్రామాలకు వెళ్లాలంటే ఖచ్చితంగా ఈ నది దాటాల్సిందే. అయితే ఈ నదిపై ప్రభుత్వం వంతెన నిర్మించకపోవడంతో రోజూ గ్రామస్థులు, రైతులు, విద్యార్థులు, ఇతర వ్యాపారులు తమ రోజువారీ పనులకోసం పడవల ద్వారానే రాకపోకలు సాగిస్తుంటారు. కాగా పడవలు నడిపే వారు సామర్థ్యంకు మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు అంటున్నారు. వారు తక్షణమే స్పందించడంతోనే ఎవరికి ప్రాణాపాయం కలగలేదని చెబుతున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న స్థానిక పరిపాలనా యంత్రాంగం, పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దీనిపై స్పందించిన అధికారులు ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఓవర్‌ లోడింగ్‌కు పాల్పడే నావికులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నదిలో నడిచే అన్ని పడవల్లో తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్స్ వంటి ప్రాణరక్షణ పరికరాలను అందుబాటులో ఉంచాలని  నావికులకు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement