వాంగ్ చుక్ దీక్ష.. ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు | Delhi High Court makes key observations regarding Sonam Wangchuk protest | Sakshi
Sakshi News home page

వాంగ్ చుక్ దీక్ష.. ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Jul 19 2026 7:34 PM | Updated on Jul 19 2026 7:41 PM

Delhi High Court makes key observations regarding Sonam Wangchuk protest

ఢిల్లీ: విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్‌కు సంబంధించిన కేసులో  ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన ఆరోగ్యం తీవ్రవంగా క్షీణించడం, డివిజన్ బెంచ్ ఆదేశాల కారణంగానే అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు కోర్టు పేర్కొంది.ఈ ప్రభుత్వ చర్యను ఏకపక్షమైనదిగా ఎట్టిపరిస్థితుల్లో పేర్కొనలేమని తెలిపింది.

వాంగ్‌చుక్ అంగీకరించిన రీతిలోనే ఆయనకు మందులని ఇస్తున్నారని పేర్కొంది. ఈ కేసుపై కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలతో పాటు పోలీసులు సైతం తమ స్పందనలను మూడు రోజుల్లోగా దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణ జూలై 24కు వాయిదా వేసింది.కాగా సోనమ్ భార్య గీతాంజలి, వాంగ్‌చుక్‌ను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని కోరారు.

దీక్ష భగ్నం

కాగా సామాజిక ఉద్యమకారుడు, పర్యా వరణవేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ నిరవధిక నిరాహార దీక్షను నిన్న (శనివారం) ఉదయం ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. నీట్‌–యూజీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించాలని, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆయన సాగిస్తున్న దీక్ష 21వ రోజుకు చేరుకోగా, ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండడంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం ఉదయం బలవంతంగా ఆసుపత్రికి తరలించారు.

ఈ సందర్భంగా దీక్షా వేదిక వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులను అడ్డుకొనేందుకు వాంగ్‌చుక్‌ మద్దతుదారులు ప్రయత్నించారు. వాంగ్‌చుక్‌తోపాటు జూన్‌ 28న నిరాహార దీక్ష ప్రారంభించిన ఆలిండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌(ఏఐఎస్‌ఏ) సభ్యులు నేహా, అమీన్, మనీష్ ను సైతం అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. ముగ్గురూ యథాతథంగా దీక్ష కొనసాగిస్తున్నారు.

మరో వైపు వాంగ్‌చుక్‌ను ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే నిరాహార దీక్ష ప్రారంభించారు. జంతర్‌మంతర్‌ వద్ద ఆయనపై ఓ మహిళ సిరా చల్లడం సంచలనాత్మకంగా మారింది. వాంగ్‌చుక్‌ దీక్షను భగ్నం చేయడాన్ని కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ తదితరులు తీవ్రంగా ఖండించారు. వాంగ్‌చుక్‌ నిరాహార దీక్షను విరమించలేదని, ఆసుపత్రి నుంచే దీక్షను కొనసాగిస్తారని కాక్రోచ్‌ జనతా పార్టీ
(సీజేపీ) ‘ఎక్స్‌’లో పోస్టుచేసింది.  

నాటకీయ పరిణామాలు  
వాంగ్‌చుక్‌ దీక్షను భగ్నం చేసే విషయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనకు ఒక్కరోజు ముందే కేంద్ర హోంశాఖ ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ సతీశ్‌ గోల్చాను ఆకస్మికంగా తప్పించి, ఆయన స్థానంలో అనురాగ్‌ కుమార్‌ను నియమించింది. కొత్త కమిషనర్‌ వెంటనే తన కార్యాచరణ ప్రారంభించారు. శుక్రవారం రాత్రి పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శనివారం తెల్లవారుజామున సిబ్బందితో సహా హాజరు కావాలని ఆదేశించారు.

‘పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల భద్రతా సన్నాహాల‘పేరుతో పోలీసులు ఉదయం 5 గంటలకు జంతర్‌మంతర్‌ వద్దకు చేరుకున్నారు. దీక్షలు జరుగుతున్న ప్రాంతంలో మొబైల్‌ ఫోన్‌ జామర్‌ ఏర్పాటు చేశారు. సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులు దీక్షా వేదిక చుట్టూ తెల్ల దుప్పట్లు ఏర్పాటు చేసి వాంగ్‌చుక్‌ను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాలను ఎవరూ ఫోన్లలో చిత్రీకరించకుండా తెల్ల దుప్పట్లను అడ్డంగా పెట్టారు.

పోలీసులను అడ్డుకునేందుకు నిరసనకారులు మానవహారంగా నిలిచారు. అయినప్పటికీ దాదాపు ఐదుగురు పోలీసులు వాంగ్‌చుక్‌ను బలవంతంగా అంబులెన్స్‌లోకి చేర్చి, వెంటనే సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రికి తరలించారు. కోర్టు ఆదేశాల మేరకే వాంగ్‌చుక్‌ను ఆసుపత్రిలో చేర్చామని, ఆయనకు వైద్య చికిత్స కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగరంలోని కీలక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement