నెహ్రూనగర్ (గుంటూరు వెస్ట్): స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో రాష్ట్రంలో గుంటూరు నగరానికి అవార్డు రాకపోవడంతో తీవ్ర వెనకబాటుకు గురైందని, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యేలు వెనకబడిపోయారని సీఎం నారా చంద్రబాబునాయుడు అసహనం వ్యక్తం చేశారు. అధికారులు ఆశించిన స్థాయిలో పని చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం గుడివాడలో జరిగిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా వర్చువల్గా ఈ–ఆటోలను ప్రారంభించారు. ఈ క్రమంలో స్వచ్ఛంధ్ర స్వర్ణాంధ్ర పురస్కారాల ప్రదానంలో భాగంగా సీఎం చంద్రబాబు గుంటూరు నగరంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల జరిగిన అవార్డుల ప్రకటనలో గుంటూరు పేరు ఎక్కడా వినిపించకపోవడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. కేంద్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యేలు, వెనకబడిపోయారని, ఇకనైనా వారు వేగం పెంచి ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. ఒక పక్క సీఎం చంద్రబాబు గుంటూరు పారిశుధ్యంపై చురకలు అంటిస్తుంటే మరో పక్క కేంద్ర మంత్రి పెమ్మసాని నవ్వుతూ సమాధానం చెప్పడంపై ఒకింత విమర్మలకు తావించినట్లయింది. నగరాభివృద్ధిపై ప్రజల్లో చైతన్యం తేవాల్సిన అవసరం ఉందన్న సీఎం.. ‘ఐ లవ్ గుంటూరు‘ అనే బోర్డులు ఏర్పాటు చేసి, ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో వర్కవుట్ ప్రారంభించాలన్నారు.


