వివాహితను వివస్త్రను చేసిన కేసులో రాజీకి టీడీపీ ప్రయత్నాలు
బండారం బట్టబయలు కావడంతో తప్పనిసరై చర్యలు
సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత హడావుడి
నామమాత్రంగా చర్యలు తీసుకుని చేతులు దులుపుకొన్న పాలకులు
చిన్న కేసుల్లో రోడ్లపై నడిపించే పోలీసులు ఇక్కడ నిందితులను దాచే యత్నం
ప్రెస్మీట్లో సైతం నిందితులను ప్రవేశపెట్టని పోలీస్ అధికారులు
వీడియో బయటికొచ్చాక ఎమ్మెల్యే నుంచి సీఎం వరకు చర్యలంటూ ప్రకటనలు
టీడీపీ నేతను సస్పెండ్ చేసి ... సీఐను వీఆర్కు పంపడంతోనే సరి
సాక్షి ప్రతినిధి, గుంటూరు: మహిళల జోలికి వస్తే అదే చివరి రోజవుతుందని చెప్పే సీఎం చంద్రబాబు, మహిళల జోలికి రావాలంటేనే వెన్నులో వణుకు పుట్టాలని పెద్ద పెద్ద మాటలు చెప్పే డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, మహిళల జోలికి వస్తే ఎంతటివారినైనా ఊరుకోమని చెప్పే హోంమంత్రి అనిత, మహిళా ఎమ్మెల్యేగా ఉన్న గళ్లా మాధవి... గుంటూరు నగరంలో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా టీడీపీ నేత మల్లెల వెంకటరమణమూర్తి, నీళ్ల కుళాయి విషయంలో తనకు రూ.10 వేల కప్పం కట్టలేదనే అక్కసుతో నడిరోడ్డుపై ఓ మహిళను వివస్త్రను చేసి తీవ్రంగా కొడుతూ హింసించినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వీడియో వెలుగులోకి రావడంతోనే...
తొలుత విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, మహిళను వివస్త్రను చేసి కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో రావడం, ‘సాక్షి’ బయటపెట్టడంతో రాజకీయ డ్రామాకు తెర తీశారు. ఓపక్క 15న ఘటన జరిగితే, 16వ తేదీన బాధితులు తనను కలిశారని చెబుతున్న వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి.. ఇంత అమానుష ఘటనకు కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోలేదు. 17వ తేదీ రాత్రి వరకు ఎందుకు తాత్సారం చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజీ ప్రయత్నాలు చేసిన టీడీపీ నేతలు అవి ఫలించకపోవడం, వీడియోలు బయటకు రావడంతో ఇక చేసేదిలేక పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 15వ తేదీన సంఘటన జరిగితే, 18వ తేదీ వరకు హోంమంత్రి గానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ ఈ విషయంపై స్పందించకపోవడం చూస్తుంటే వీరికి మహిళల భద్రత పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. ఇదేదో మారుమూల ప్రాంతంలో జరిగిన సంఘటన కాదు. జిల్లా కేంద్రమైన గుంటూరు నడిబొడ్డున ఇంత దారుణం జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది? కనీసం హోంమంత్రికి సమాచారం లేదా? ఉన్నా టీడీపీ నేతలు చేసిన దారుణంపై స్పందించేందుకు మనసు రాలేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఏం చేసినా మనవారైతే ఓకే..
చిన్న చిన్న సంఘటనలకే నిందితులను రోడ్లపై తిప్పడం, థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించడం వంటివి చేసే పోలీసు యంత్రాంగం.. రేంజ్ ఐజీ, జిల్లా ఎస్పీ కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఉన్న కృష్ణబాబు కాలనీలో ఓ మహిళను వివస్త్రను చేసి దారుణంగా కొట్టిన ఘటనకు పాల్పడిన నిందితుల విషయంలో మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళను అంత దారుణంగా హింసించిన నిందితులను కనీసం ప్రెస్మీట్లో కూడా చూపించకుండా, దొంగచాటుగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం చూస్తుంటే పక్షపాత వైఖరి తేలుతోంది. ఎంతటి నేరం చేసినా వారు అధికార పారీ్టకి చెందిన వారైతే చాలు పోలీసులు సైతం ప్రత్యేక ప్రేమ చూపుతున్నారనేది స్పష్టమవుతోంది.
ఇంత ఆలస్యమా?
సంఘటన జరిగి మూడు రోజులు దాటిన తర్వాత మహిళల పట్ల అపార ప్రేమ ఉన్నట్లు, వారి భద్రత విషయంలో తాము చిత్తశుద్ధితో ఉన్నట్లు నటించడంలో అధికార పార్టీ నేతలు ఒకరికొకరు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి నుంచి సీఎం చంద్రబాబు వరకు మూడు రోజులపాటు నిద్ర నటించి, వీడియోలు బయటకు రాగానే ఉలిక్కిపడి నామమాత్రంగా చర్యలు తీసుకున్నారు. తామేదో ఈ సంఘటనపై సీరియస్గా ఉన్నట్లు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు.
ఇందులో భాగంగా ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత కూడా అరెస్టు చేయని పోలీసులు... వీడియోలు బయటకు రాగానే ఏకంగా ఏకంగా జిల్లా ఎస్పీ శనివారం రాత్రి మహిళా కమిషన్ చైర్పర్సన్తో కలసి బాధితురాలి ఇంటికి వచ్చ మరీ విచారణ చేయడం గమనార్హం. వీడియోలు బయటకు వచ్చేంత వరకు కనీసం దారుణ ఘటనకు కారకుడైన టీడీపీ నేత, ఆయన బంధువులను అరెస్టు చేయకపోవడం చూస్తుంటే ఈ అమానవీయ ఘటనపై ఏ స్థాయిలో స్పందించారో అర్థమవుతోంది. చివరకు సీఐను వీఆర్కు పంపి చేతులు దులుపుకొన్నారనే విమర్శలు వస్తున్నాయి.


