సాక్షి, శ్రీకాకుళం జిల్లా: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన నేరం ఏంటి? అంటూ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. వైఎస్సార్సీపీలో ఉండటం, మంత్రిగా పనిచేయడం సీదిరి చేసిన నేరమా?. వైఎస్సార్సీపీ కుటుంబానికి చెందిన వ్యక్తి అని హత్యానేరం మోపుతారా? అంటూ చంద్రబాబు సర్కార్ను నిలదీశారు.
‘‘వైఎస్సార్సీపీ కుటుంబానికి చెందిన వ్యక్తి అని హత్యానేరం మోపుతారా?. వెనుకబడిన వర్గాల నుంచి కష్టపడి పైకొచ్చిన నేత సీదిరి. శ్రీకాకుళం జిల్లాలో ఏనాడైనా టీడీపీ మత్స్యకారులకు సీటు ఇచ్చిందా?. మత్స్యకారుల తరఫున సీదిరి పోరాడుతుంటే, మాట్లాడుతుంటే ఓర్చుకోలేకపోతున్నారు’’ అని ధర్మాన మండిపడ్డారు.
వైఎస్సార్సీపీ నేతలే కూటమి సర్కార్ టార్గెట్: శ్రీకాంత్రెడ్డి
తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాన్ని మర్డర్ కేసుగా మార్చటం సిగ్గుచేటు అన్నారు. సాయికృష్ణ లాకప్డెత్, దళితుడు క్రాంతికుమార్ ఆత్మహత్య, గుంటూరులో మహిళను వివస్త్ర చేయటం వంటి ఘటనలతో రాష్ట్రం పరువు పోయింది. రాష్ట్రంలో తప్పు చేసిన వారిని శిక్షించే పరిస్థితి లేదు. కేవలం వైఎస్సార్ సీపీ నేతలను టార్గెట్ చేయటమే పోలీసుల పనిగా మారిందని ఆయన మండిపడ్డారు.
బీసీ వర్గానికి చెందిన సీదిరి అప్పలరాజు అరెస్టు అన్యాయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బీసీలు, దళితులపై వేధింపులు సరికాదు. ఏపీలో జరుగుతున్న దారుణాలపై దేశమంతటా చర్చ జరుగుతోంది. మా పార్టీ నేతలపై ఇలాగే వేధింపులు ఇలాగే కొనసాగితే తీవ్రంగా స్పందిస్తాం’’ అని శ్రీకాంత్రెడ్డి హెచ్చరించారు.


