సాక్షి,విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేబినెట్ సబ్ కమిటీ (మంత్రివర్గ ఉపసంఘం)టోకరా వేసింది. ఉద్యోగ సంఘాలు సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న తమ ప్రధాన సమస్యలను ప్రభుత్వం ముందుంచినప్పటికీ, మంత్రివర్గ ఉపసంఘం వాటిలో ఒక్క హామీకి కూడా స్పష్టమైన పరిష్కారం చూపకపోవడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది.
బుధవారం విజయవాడలో 21 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రుల కమిటీ కీలక భేటీ నిర్వహించింది. ఈ చర్చల సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు తమకు సంబంధించిన 21 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. నూతన పీఆర్సీ తక్షణ ఏర్పాటు. ఐఆర్ ప్రకటన. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఐదు డీఏల చెల్లింపు. వేల కోట్ల రూపాయల మేర బకాయి ఉన్న పెండింగ్ బిల్లులను త్వరగా విడుదల చేయడం. అయితే, ఉద్యోగుల ఆర్థిక, సేవా పరమైన ఈ ప్రధాన డిమాండ్లపై మంత్రుల కమిటీ ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వకుండా దాటవేసింది.
పీఆర్సీ, ఐఆర్, డీఏల చెల్లింపు, బకాయిల విడుదలకు సంబంధించి మంత్రులు పూర్తిగా మౌనం వహించారు. ఈ ఆర్థికపరమైన అంశాలన్నింటినీ సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అంటూ మంత్రుల కమిటీ చర్చలను ముగించేసింది.
ప్రభుత్వ అగ్ర నాయకత్వంతో చర్చిస్తామనే పాత సాకుతోనే మంత్రులు ఈ సమావేశాన్ని ముగించడంతో ఉద్యోగ సంఘాల నేతలు, సచివాలయ సిబ్బంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చర్చల పేరుతో ప్రభుత్వం తమను మరోసారి టోకరా వేసిందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


