సాక్షి, విశాఖ: ఏపీలో కూటమి ఎంపీ సీఎం రమేష్, ఆయన అనుచరులు పంచదార్ల కొండలను దోచుకుంటున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఇలా అక్రమ సంపాదనతో ప్రత్యేక విమానాలు, ఎన్నికల్లో సీట్లు కొంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే పంచదార్ల కొండలను నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా మంగళవారం ఛలో పంచదారల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పంచదార్ల కొండలను నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలి. అక్రమ సీఎం సంపాదనతో సీఎం రమేష్ విమానాలు, ఎన్నికల్లో సీట్లు కొంటున్నారు. ఒక వైపు పంచదార్ల కొండలను.. మరోవైపు సింహాచలం కొండలను ధ్వంసం చేస్తున్నారు. అక్రమ మైనింగ్ ద్వారా పురాతన ఆలయానికి నష్టం జరుగుతుందని కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.
కొండపై ఇచ్చిన అనుమతులకు మించి తవ్వకాలు జరిపారు. సీఎం రమేష్, ఆయన అనుచరులు కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. అక్రమ మైనింగ్ వల్ల పంచదార్లలో ఒక దారలో బురద వస్తుంది. వందల ఏళ్ళ నుంచి పంచదార్ల ఉమ ధర్మ లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రవహిస్తున్నాయి.
మైనింగ్కు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.


