లక్నో: నీట్ పరీక్షలో వృద్ధులకు రిజర్వేషన్ ఇవ్వాలంటూ లక్నోకు చెందిన అభ్యర్థి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. 71 ఏళ్ల వయసులో నీట్ యూజీ పరీక్ష రాసిన అత్యంత వృద్ధ అభ్యర్థి అశోక్ బహార్, మెడికల్ సీట్ల భర్తీలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా 1శాతం రిజర్వేషన్ కోటా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు చెందిన అశోక్ బహార్ అనే 71 ఏళ్ల వృద్ధుడు ఇటీవల జరిగిన నీట్ యూజీ పరీక్షకు హాజరయ్యారు. చదువుకోవడానికి వయసుతో నిమిత్తం లేదని నిరూపిస్తూ, తన డాక్టర్ కలని నెరవేర్చుకునేందుకు ఆయన ఈ ప్రయత్నం చేశారు. అయితే, కేవలం పరీక్ష రాసేందుకు అవకాశం ఇస్తే సరిపోదని, వృద్ధులకు కూడా వైద్య కళాశాలల్లో సీట్లు దక్కేలా 1శాతం ప్రత్యేక కోటా కేటాయించాలని కోరుతూ ఆయన అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
నేషనల్ మెడికల్ కమిషన్,సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నీట్ పరీక్ష రాయడానికి గరిష్ట వయోపరిమితి లేదు. వయసు అడ్డుకాదన్నప్పుడు, సీట్ల భర్తీలోనూ సీనియర్ సిటిజన్లకు న్యాయం జరగాలని ఆయన వాదించారు. నీట్ ప్రవేశాల్లో వికలాంగులు, మాజీ సైనికుల పిల్లలు, క్రీడాకారులకు ప్రత్యేక రిజర్వేషన్లు లేదా ప్రయోజనాలు కల్పిస్తున్నప్పుడు, సీనియర్ సిటిజన్లను ఎందుకు విస్మరిస్తున్నారని పిటిషనర్ ప్రశ్నించారు.
ఈ విషయమై అంతకుముందే మే, జూన్ నెలల్లో ఆయన కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించారు. అయితే అక్కడ ఎలాంటి స్పందన రాకపోవడంతోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. వైద్య రంగంలో సరికొత్త చర్చదేశంలో వైద్య విద్యకు విపరీతమైన పోటీ ఉన్న తరుణంలో ఈ డిమాండ్ జాతీయ స్థాయిలో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది.
సాధారణంగా యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైద్య సీట్లను కేటాయిస్తారు. అయితే, వృద్ధాప్యంలో కూడా చదువుకోవాలనే ఆకాంక్ష ఉన్నవారికి సమాన అవకాశాలు కల్పించాలా వద్దా అనే చట్టపరమైన ప్రశ్న ఇప్పుడు కోర్టు ముందుకు వచ్చింది. అలహాబాద్ హైకోర్టు ఈ పిటిషన్పై జూలై 21న విచారణ జరపనుంది.


