పాట పాడింది.. దేశం చప్పట్లు కొట్టింది | Best Female Playback Singer Award For Vaikom Vijayalakshmi | Sakshi
Sakshi News home page

పాట పాడింది.. దేశం చప్పట్లు కొట్టింది

Jul 18 2026 8:44 PM | Updated on Jul 18 2026 9:08 PM

Best Female Playback Singer Award For Vaikom Vijayalakshmi

ఒక పాట.. భాషల సరిహద్దులను దాటి కోట్లాది మనసులను తాకుతుంది. ఒక స్వరం... కళ్లతో కాదు, హృదయంతో ప్రపంచాన్ని చూస్తుందని నిరూపిస్తుంది. అలాంటి అరుదైన గాయని వైక్కం విజయలక్ష్మి. 2024 సంవత్సరానికి ప్రకటించిన జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ మహిళా నేపథ్య గాయని అవార్డును ఆమె సొంతం చేసుకున్నారు.

కేరళలోని కొట్టాయం జిల్లా వైకోమ్‌లో విజయలక్ష్మి అనంత సుబ్రహ్మణియన్ జన్మించారు. పుట్టుకతోనే తీవ్రమైన దృష్టిలోపంతో జన్మించిన ఆమెకు ఈ ప్రపంచాన్ని కళ్లతో చూసే అదృష్టం లేకపోయినా, సంగీతాన్ని మాత్రం హృదయంతో ఆస్వాదించే వరం లభించింది. చిన్నప్పటి నుంచే కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకున్న ఆమె, వీణ వాయించడంలోనూ విశేష ప్రతిభ కనబరిచారు. సంగీతమే జీవితంగా భావిస్తూ నిరంతర సాధనతో తన ప్రతిభను మెరుగుపరుచుకున్నారు.

2013లో విడుదలైన సెల్యులాయిడ్ సినిమాతో నేపథ్య గాయనిగా సినీ రంగంలో అడుగుపెట్టిన వైక్కం విజయలక్ష్మి, తొలి పాటతోనే సంగీత దర్శకులు, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత ఒరు వడక్కన్ సెల్ఫీ చిత్రంలోని కైక్కొట్టుం కండిట్టిల్లా పాట ఆమెకు అపారమైన గుర్తింపును తీసుకొచ్చింది. అనంతరం ‘తెరి’ చిత్రంలోని ఎన్ జీవనే, కనా చిత్రంలోని వాయాడి పెట్ట పుల్ల వంటి పాటలు దక్షిణ భారత సంగీత ప్రపంచంలో ఆమె స్థానాన్ని మరింత బలపరిచాయి. భావోద్వేగాన్ని స్వరంలో పలికించడంలో ఆమెకు ఉన్న ప్రత్యేక నైపుణ్యమే ప్రతి పాటను శ్రోతల హృదయాలకు చేరువ చేసింది.

ఆమె ప్రయాణంలో గుర్తింపులు కూడా తక్కువేం కాదు. ఫిల్మ్‌ఫేర్ పురస్కారం, ఏషియానెట్ పురస్కారం, వనిత పురస్కారం, కేరళ ప్రభుత్వ గౌరవాలు సహా అనేక అవార్డులు ఆమెను వరించాయి. అయితే భారతీయ సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర పురస్కారం మాత్రం కాస్త సమయం పట్టింది. ఆ నిరీక్షణకు ముగింపు పలికింది ఏఆర్‌ఎమ్‌ చిత్రంలోని అంగు వాన కొనిలు పాట.

భావోద్వేగాలతో నిండిన ఈ గీతంలో వైక్కం విజయలక్ష్మి తన గాత్రంతో ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లారు. మలయాళంలో పుట్టిన ఈ పాట భాషల సరిహద్దులను దాటి తెలుగు ప్రేక్షకుల హృదయాలను సైతం తాకింది. పదాలు అర్థం కాకపోయినా.. ఆమె స్వరంలో వినిపించిన ఆవేదన, మమకారం, ప్రేమ ప్రతి ఒక్కరి మనసును కదిలించాయి. అదే గీతం ఇప్పుడు ఆమెకు జాతీయ ఉత్తమ మహిళా నేపథ్య గాయని పురస్కారాన్ని అందించింది.

వైక్కం విజయలక్ష్మి ప్రయాణం ఒక గాయని విజయగాథ మాత్రమే కాదు.. జీవితం మనకు ఏమి ఇవ్వలేదన్నది కాదు, ఉన్న ప్రతిభతో ఎంత ఎత్తుకు ఎదిగామన్నదే ముఖ్యమని చెప్పే స్ఫూర్తిదాయకమైన కథ. కళ్లలో వెలుగు లేకపోయినా.. తన గాత్రంతో కోట్లాది మంది హృదయాల్లో వెలుగులు నింపిన ఆమె ఇప్పుడు భారతీయ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆమె గెలిచింది ఒక అవార్డును మాత్రమే కాదు... కోట్లాది మంది అభిమానుల మనసులను కూడా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement