సాక్షి, ఢిల్లీ: లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, ప్రధాని నివాసం ఎదుట చేసిన నిరసనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు ( మంగళవారం) మండిపడ్డారు. విద్యార్థులకు మీరు ఆగ్రహం కంటే బాధ్యతనే బాకీ ఉన్నారన్నారు. విద్యార్థుల ఆందోళనను రాజకీయంగా వాడుకోవడం ఆపాలని హితవు పలికారు.
ఈ రోజు సాయంత్రం ప్రధాని నివాసం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీట్ లీకేజ్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ నిరసన చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులు ఏర్పడ్డాయి.
కాగా తాజాగా ఈ అంశంపై ఎక్స్ వేదికగా ధర్మేంద్రప్రధాన్ మాట్లాడుతూ" ప్రజలకు అసౌకర్యం కలిగిస్తూ, నిర్ధారిత భద్రతా నియమాలను ఉల్లంఘించి, గౌరవనీయ ప్రధానమంత్రి గారి నివాసం బయట ధర్నాకు దిగారు. సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసినప్పటికీ, కాంగ్రెస్ ప్రజాస్వామ్య చర్చ కన్నా రాజకీయ ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చింది. వారి లక్ష్యం విద్యార్థులకు పరిష్కారాలు అందించడం ఎన్నడూ కాదు, కేవలం రాజకీయ శీర్షికల కోసం గందరగోళం సృష్టించడమే. నీట్ గురించి చర్చించడానికి, సభలో మన యువత యొక్క ప్రతి నిజమైన ఆందోళనను పరిష్కరించడానికి మా ప్రభుత్వం 100% కట్టుబడి ఉంది. విద్యార్థులకు మనం ఆగ్రహం కన్నా ఎక్కువ ఇవ్వాలి. వారికి మనం సమాధానాలు, సంస్కరణలు మరియు జవాబుదారీతనం ఇవ్వాలి. వాటిని అందించడానికే మా ప్రభుత్వం కట్టుబడి ఉంది." అని రాసుకొచ్చారు.


