గాంగ్టక్: సిక్కింలోని నామ్చి జిల్లాలో నిర్మిస్తున్న ఎన్హెచ్పిసి తీస్తా స్టేజ్-VI జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం కూలిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 20 కి చేరుకుంది. ప్రాజెక్ట్ అధికారులతో సహా మొత్తం 25 మంది కార్మికులు టన్నెల్లో చిక్కుకోగా, వారిలో 20 మంది మరణించినట్లు నామ్చి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారికంగా ప్రకటించారు.
కాగా మృతిచెందిన వారిలో ఇప్పటివరకు 12 మృతదేహాలను బయటకు తీశారు. అందులో ఏడు మృతదేహాలను గుర్తించగా, మిగిలిన వాటి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. కాగా ఈ ప్రమాదంలో కేరళలోని కోట్టాయం జిల్లాకు చెందిన జియాలజిస్ట్ అనీష్ మోహన్ గల్లంతయ్యారు.
ప్రాథమిక అంచనా ప్రకారం రాళ్ల మధ్యలో పేరుకుపోయిన మిథేన్ గ్యాస్ అకస్మాత్తుగా పేలడంతో దట్టమైన పొగ, విషవాయువులు టన్నెల్ అంతటా వ్యాపించాయి. ఈ పేలుడు కారణంగానే టన్నెల్ కూలిపోయిందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు, గాయపడిన వారికి ₹50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.
ప్రధాని నరేంద్రమోదీ ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ₹2 లక్షలు, గాయపడిన వారికి ₹50,000 చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.


