రూ. 82 కోట్లకు కొన్నా!.. ఇప్పుడు రూ. 16 వేల కోట్లకు పైమాటే! | Raj Kundra bought RR for Rs 82 cr as a Valentines Day gift for Shilpa Shetty | Sakshi
Sakshi News home page

రూ. 82 కోట్లకు కొన్నాను!.. ఇప్పుడు రూ. 16 వేల కోట్లకు పైమాటే!

Jul 23 2026 5:54 PM | Updated on Jul 23 2026 6:31 PM

Raj Kundra bought RR for Rs 82 cr as a Valentines Day gift for Shilpa Shetty

ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ రాజస్తాన్‌ రాయల్స్‌ మాజీ సహ యజమాని రాజ్‌ కుంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన భార్య శిల్పా శెట్టికి ప్రేమికుల దినోత్సవం కానుకగా నాడు రాజస్తాన్‌ ఫ్రాంఛైజీలో వాటా కొనుగోలు చేసినట్లు తెలిపాడు.

వాలైంటైన్స్‌ గిఫ్ట్‌
ఎస్‌ఎమ్‌టీవీ యూట్యూబ్‌ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘‘వాలైంటైన్స్‌ గిఫ్ట్‌గా 2009లో నేను రాజస్తాన్‌ రాయల్స్‌లో వాటా కొనుగోలు చేశాను. నా భార్య శిల్పాకు మంచి బ్రాండ్‌ వాల్యూ ఉంది. దానిని నేను డబ్బుగా మలచాలని అనుకున్నాను.

ఇప్పుడు రూ. 16 వేల కోట్లకు పైమాటే!
అప్పుడే వాటా కొన్నాను. అయితే, ఇప్పటికీ దానికి సంబంధించి కేసు కొనసాగుతూనే ఉంది. నేను ఆ ఫ్రాంఛైజీలో పెట్టుబడులు పెట్టినపుడు దాని విలువ రూ. 700 కోట్లు మాత్రమే. కానీ ఇప్పుడు ఏకంగా రూ 16 వేల కోట్లకు చేరింది’’ అని తెలిపాడు.

ఇక బెట్టింగ్‌ వివాదం గురించి స్పందిస్తూ.. ‘‘బెట్టింగ్‌కు అనుమతి లేదు. కానీ మాపై బెట్టింగ్‌ ఆరోపణలు వచ్చాయి. మా జట్టుపై రెండేళ్ల నిషేధం విధించారు. కొంతమంది ఆటగాళ్లపై కూడా నిషేధం పడింది. యజమానులపై కూడా బ్యాన్‌ విధించారు.

అలా మాట్లాడటం కూడా నిషిద్ధమే
నిజంగా బెట్టింగ్‌ జరిగిందా? అంటే.. ఇద్దరు కూర్చుని సరదాగా పందెం వేసుకోవం సాధారణంగా ఎక్కడైనా జరిగే విషయమే. అయితే, ఆరోజు రూ. 500కు బెట్‌ వేద్దామా? అన్నట్లుగా సంభాషణ సాగింది. కానీ అలా మాట్లాడటం కూడా నిషిద్ధమే అని తర్వాత తెలిసింది.

సరదాగా అన్న మాటలకు కూడా మమ్మల్ని బ్యాన్‌ చేస్తారా? ఇప్పటికీ ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. అయినా యజమానుల్లో కూడా నన్నొక్కడినే బాధ్యుడిని చేశారు’’ అని రాజ్‌ కుంద్రా చెప్పుకొచ్చాడు. కాగా అక్రమ బెట్టింగ్‌కు పాల్పడ్డాడనే ఆరోపణలతో 2013లో రాజ్‌ కుంద్రాపై ఆరోపణలు రాగా.. విచారణ కోసం సుప్రీం కోర్టు నాడు జస్టిస్‌ లోధా కమిటీ ఏర్పాటు చేసింది. 

జీవితకాల నిషేధం
ఈ క్రమంలో రాజ్‌ కుంద్రా ఎలాంటి క్రికెట్‌ సంబంధిత కార్యకలాపాల్లో భాగం కాకుండా 2015లో అతడిపై జీవితకాల నిషేధం పడింది. రాజస్తాన్‌రాయల్స్‌ను 2016, 2017 సీజన్లలో ఆడకుండా నిషేధించారు.

ఇదిలా ఉంటే.. రాజ్‌ కుంద్రా నాడు రాజస్తాన్‌ ఫ్రాంఛైజీలో రూ. 81.9 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. అయితే, ఐపీఎల్‌ ఆరంభమైన (2008) నాటి నుంచి దాదాపు ఐదారేళ్ల పాటు యజమానులకు పెద్దగా లాభాలు రాలేదని రాజ్‌ కుంద్రా చెప్పాడు. 

వార్షిక లాభం రూ. 200- 500 కోట్ల వరకు
అయితే, ఇప్పుడు మాత్రం ఓనర్లు భారీగా ఆర్జిస్తున్నారని.. వారి వార్షిక లాభం రూ. 200- 500 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశాడు. 70 శాతం ఆదాయం ప్రసార హక్కుల ద్వారా.. 10-15 శాతం జెర్సీ స్పాన్సర్‌షిప్‌లు, మిగతా 10- 15 శాతం టికెట్ల అమ్మకాల ద్వారా వస్తుందని రాజ్‌ కుంద్రా తెలిపాడు.

కాగా ఐపీఎల్‌-2026లో రాజస్తాన్‌ రాయల్స్‌ మెరుగ్గా రాణించింది. అద్భుతమైన ఆట తీరుతో ప్లే ఆఫ్స్‌ దశకు చేరుకుంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించి క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించింది. అయితే, గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఓడి నిరాశగా నిష్క్రమించింది. 

ఇక రాజస్తాన్‌ ఫ్రాంఛైజీ యాజమాన్యం ఇటీవలే చేతులు మారిన సంగతి తెలిసిందే. పారిశ్రామిక వేత్తలు లక్ష్మీనివాస్‌ మిట్టల్‌, ఆదిత్య మిట్టల్‌, ఆదార్‌ పూనావాలా ఈ ఫ్రాంఛైజీని దాదాపు రూ. 16 వేల కోట్లకు సొంతం చేసుకున్నారు. 

చదవండి: టీమిండియా తరఫున అతడి అరంగేట్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement