IND vs ZIM: టీమిండియా తరఫున అతడి అరంగేట్రం | IND vs ZIM 1st T20I: Check India Playing XI Who Is Ashok Sharma | Sakshi
Sakshi News home page

IND vs ZIM: టీమిండియా తరఫున అతడి అరంగేట్రం

Jul 23 2026 4:26 PM | Updated on Jul 23 2026 4:46 PM

IND vs ZIM 1st T20I: Check India Playing XI Who Is Ashok Sharma

PC: BCCI X

జింబాబ్వేతో తొలి టీ20 సందర్భంగా అశోక్‌ శర్మ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌ వేదికగా ఈ ఫాస్ట్‌ బౌలర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో సీనియర్లను పక్కనపెట్టిన యాజమాన్యం.. పేస్‌ దళంలో మయాంక్‌ యాదవ్‌, ప్రిన్స్‌ యాదవ్‌ వంటి యువ క్రికెట్లతో పాటు తొలిసారి అశోక్‌ శర్మను ఎంపిక చేసింది.

ఎవరీ అశోక్‌ శర్మ?
రాజస్తాన్‌లోని జైపూర్‌కి సమీపంలో గల రాంపుర అనే గ్రామంలో 2002లో జన్మించాడు అశోక్‌ శర్మ. అతడి తండ్రి సాధారణ రైతు. కుటుంబ పరిస్థితి ఆర్థికంగా అంతంత మాత్రమే. అయినప్పటికీ అశోక్‌తో పాటు అతడి అన్న అక్షయ్‌ శర్మ కూడా క్రికెటర్‌ కావాలనే కలలు కన్నాడు.

జిల్లా స్థాయిలో అక్షయ్‌ ఆడాడు. అయితే, తమ్ముడి కోసం తన కెరీర్‌ను త్యాగం చేశాడు. దీంతో అశోక్‌కు మార్గం సుగమమైంది. ఈ విషయం గురించి అశోక్‌ శర్మ స్వయంగా జాతీయ మీడియాకు వెల్లడించాడు.

లీడింగ్‌ వికెట్‌ టేకర్‌
కుటుంబ సహకారంతో తన కలలను నిజం చేసుకునే క్రమంలో అశోక్‌ శర్మ.. 2025-26 సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ దేశీ టీ20 టోర్నీ తాజా ఎడిషన్‌లో పది మ్యాచ్‌లలో కలిపి 22 వికెట్లు కూల్చి..  లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. గంటకు 150కి పైగా కిలోమీటర్ల వేగంతో బౌలింగ్‌ చేయగల సత్తా ఉన్న అశోక్‌ శర్మ.. ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల దృష్టిలో పడ్డాడు.

ఫాస్టెస్ట్‌ బాల్‌
ఈ క్రమంలో ఐపీఎల్‌-2026 వేలంలో గుజరాత్‌ టైటాన్స్‌ అశోక్‌ను రూ. 90 లక్షలకు కొనుగోలు చేసింది. ఆకాశ్‌ నెహ్రా మార్గదర్శనంలో అతడు రాటుదేలాడు. ఈ ఏడాది రాజస్తాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా గంటకు 154.2 కిలో మీటర్లకు పైగా వేగంతో బంతిని విసిరి హాట్‌ టాపిక్‌గా మారాడు. మొత్తంగా ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన ఈ రైటార్మ్‌ ఫాస్ట్‌ మీడియం పేసర్‌ ఆరు వికెట్లు దక్కించుకున్నాడు.

 ఈ నేపథ్యంలోనే తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైన 24 ఏళ్ల అశోక్‌ శర్మ.. తాజాగా అరంగేట్రం చేశాడు. ఇదిలా ఉంటే.. జింబాబ్వేతో తొలి టీ20లో భారత్‌ ముగ్గురు సీమర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగింది. 

తుదిజట్టులో ప్రిన్స్‌ యాదవ్‌, మయాంక్‌ యాదవ్‌లతో పాటు అశోక్‌ శర్మ కూడా పేస్‌ విభాగంలో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు.. జింబాబ్వే తరఫున బెన్‌ కర్రాన్‌ అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేశాడు.

తుదిజట్లు
భారత్‌
వైభవ్‌ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీప‌ర్‌), శ్రేయస్ అయ్యర్(కెప్టెన్‌), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్

జింబాబ్వే
బ్రియాన్ బెన్నెట్, తడివానాషే మారుమణి (వికెట్ కీప‌ర్‌), బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్‌), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్‌హురి, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement