source: BCCI X
జింబాబ్వేతో ఇవాళ (జూలై 23) జరగనున్న తొలి టీ20కి ముందు భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్లో అతడు 16 పరుగులు చేస్తే, టీ20 క్రికెట్లో 6000 పరుగులు పూర్తి చేసిన భారత బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించుకుంటాడు.
ప్రస్తుతం అభిషేక్ 203 టీ20 మ్యాచ్ల్లో 199 ఇన్నింగ్స్ ఆడి 5984 పరుగులు చేశాడు. తొలి టీ20లో 16 పరుగులు సాధిస్తే, 200 ఇన్నింగ్స్లోపు 6000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత బ్యాటర్గా నిలుస్తాడు. ఈ జాబితాలో ఇప్పటికే కేఎల్ రాహుల్ (166 ఇన్నింగ్స్), విరాట్ కోహ్లీ (184), శుభ్మన్ గిల్ (185) ఉన్నారు.
అంతర్జాతీయంగా ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉంది. అతడు కేవలం 162 ఇన్నింగ్స్లోనే 6000 టీ20 పరుగులు పూర్తి చేశాడు.
జింబాబ్వేపై అద్భుతమైన రికార్డు
అభిషేక్ శర్మకు జింబాబ్వేపై అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు ఆ జట్టుతో ఆడిన ఆరు టీ20ల్లో 179 పరుగులు చేసి, భారత్ తరఫున జింబాబ్వేపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కొనసాగుతున్నాడు.
అంతేకాదు, ఈ మ్యాచ్లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా కంటే కనీసం 16 పరుగులు ఎక్కువ చేస్తే, భారత్-జింబాబ్వే మధ్య జరిగిన టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ కొత్త రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది.
నేటి భారత్-జింబాబ్వే మ్యాచ్ భారతకాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు మొదలవుతుంది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత యువ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.


