PC: SLC
శ్రీలంకతో రెండో అనధికారిక టెస్టులో భారత అండర్-19 జట్టు అదరగొట్టింది. ఆతిథ్య జట్టును ఏకంగా 211 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. తద్వారా రెండు మ్యాచ్ల సిరీస్ను భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది.
తొలి టెస్టు డ్రా
కాగా మూడు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత అండర్-19 జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా వన్డే సిరీస్ను ఆతిథ్య లంక యువ జట్టు 2-1తో వశం చేసుకోగా.. ఇరుజట్ల మధ్య గాలె వేదికగా తొలి అనధికారిక టెస్టు డ్రా అయింది.
తొలి ఇన్నింగ్స్లో 411
ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య సోమవారం రెండో అనధికారిక టెస్టు మొదలైంది. కొలంబోలో టాస్ గెలిచిన శ్రీలంక అండర్-19 తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్కు దిగింది. తొలి ఇన్నింగ్స్లో 105.2 ఓవర్లలో 411 పరుగుల మేర భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది.
శతక్కొట్టిన కుశాగ్ర, మనాల్
మొదటి ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లలో ఓపెనర్లు లక్ష్య రాజేశ్ రాయ్ చందాని, సాగర్ విర్క్ డకౌట్ అయ్యారు. అయితే, వన్డౌన్ బ్యాటర్ కుశాగ్ర ఓజా (111), ఐదో స్థానంలో వచ్చిన మనాల్ చౌహాన్ (150) శతకాలతో అదరగొట్టారు. వీరికి తోడుగా కెప్టెన్ యశ్వర్దన్ చౌహాన్ అర్ధ శతకం (78)తో రాణించాడు. లోయర్ ఆర్డర్లో చిగురుపాటి వెంకట 25 పరుగులు రాబట్టాడు.
148 పరుగులకే లంక ఆలౌట్
ఇక శ్రీలంక బౌలర్లలో గిమ్హాన్ మెండిస్ మూడు వికెట్లు తీయగా.. సెత్మిక సెనెవిరత్నె, దుల్నిత్ సిగెర, విఘ్నేశ్వరన్ ఆకాశ్ తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 148 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ దిమంత మహావితన 24, విరాన్ చముదిత 21, దుల్నిత్ సిగెర 31, సెత్మిక 25 పరుగులతో ఫర్వాలేదనిపించారు.
భారత బౌలర్లలో ప్రణవ్ రాఘవేంద్ర, చిగురుపాటి వెంకట, జగన్నాథన్ హెంచుదేశన్, రోహిత్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. కావ్యా పటేల్కు ఒక వికెట్ దక్కింది. ఇక శ్రీలంక మొదటి ఇన్నింగ్స్లో 148 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్కు 263 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
లక్ష్యం 472
ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. మూడు వికెట్ల నష్టానికి 208 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈసారి ఓపెనర్లలో లక్ష్య రాయ్చందాని అజేయ శతకం (116 బంతుల్లో 100)తో మెరవగా.. సాగర్ విర్క్ (17) నిరాశపరిచాడు. వన్డౌన్లో వచ్చిన ఆర్యన్ సక్పా (6) విఫలం కాగా.. కెప్టెన్ యశ్వర్దన్ 20 పరుగులు చేయగలిగాడు. మనాల్ చౌహాన్ 51 పరుగలతో అజేయంగా నిలిచాడు.
211 పరుగుల తేడాతో భారత్ జయభేరి
ఇక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని (263+208).. భారత్ శ్రీలంకకు 472 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. గురువారం నాటి ఆఖరి రోజు ఆటలో భాగంగా కేవలం 260 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్ 211 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించి సిరీస్ను కైవసం చేసుకుంది.
చెలరేగిన భారత బౌలర్లు
లక్ష్య ఛేదనలో లంక బ్యాటర్లలో సెనుజ వెకునగొడ (64), కెప్టెన్ విమత్ దిన్సార (64) అర్ధ శతకాలతో రాణించగా.. కవిజ గెమాగే 36, సెత్మిక 42 పరుగులతో ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో రోహిత్ యాదవ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. చిగురుపాటి వెంకట మూడు వికెట్లు దక్కించుకున్నాడు. మిగిలిన వారిలో ప్రణవ్ రాఘవేంద్ర, జగన్నాథన్ హెంచుదేశన్, యశ్వర్దన్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
శ్రీలంక వర్సెస్ భారత్ రెండో అనధికారిక టెస్టు సంక్షిప్త స్కోర్లు
భారత్: 411 & 208/3 డిక్లేర్డ్
శ్రీలంక: 148 & 260


