Photo Credit: BCCI Twitter
కొలంబో వేదికగా శ్రీలంక అండర్-19 జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు మ్యాచ్లో భారత అండర్-19 జట్టు తొలిరోజే పట్టు బిగించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 65 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరు డకౌట్ అయిన వేళ వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన కుషాగ్ర ఓఝా (103 నాటౌట్) అజేయ సెంచరీతో మెరిశాడు. కెప్టెన్ యశ్బర్దన్ (78), మనాల్ చౌహన్ (55 నాటౌట్) అర్ధశతకాలతో రాణించడంతో భారీ స్కోరు దిశగా సాగుతోంది. లంక బౌలర్లలో గిమ్హన్ మెండిస్ రెండు వికెట్లు తీయగా, సెత్మికా ఒక వికెట్ పడగొట్టాడు.
ఎవరీ కుషాగ్ర?
సున్నా పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును అజేయ సెంచరీతో నడిపించిను కుషాగ్ర ఒక్కసారిగా హీరో అయిపోయాడు. రాజస్తాన్కు చెందిన 16 ఏళ్ల కుషాగ్ర ఓఝా టాపార్డర్లో బ్యాటింగ్కు వస్తుంటాడు. హంబన్టోటా వేదికగా శ్రీలంకతో జరిగిన యూత్ వన్డే సిరీస్ ద్వారా అండర్-19లో అరంగేట్రం చేసిన కుషాగ్ర ఆడిన తొలి మ్యాచ్లోనే 92 పరుగుల ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు.
తాజాగా తన తొలి అండర్-19 అనధికారిక టెస్టు మ్యాచ్ ఆడుతున్న కుషాగ్ర.. డెబ్యూ మ్యాచ్లోనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో 50 ఓవర్ల ఫార్మాట్లతో పాటు సంప్రదాయ ఫార్మాట్లోనూ అండర్-19 జట్టులో టాప్-4 బ్యాటింగ్లో కుషాగ్ర ఓఝా కీలక ఆటగాడిగా మారిపోయాడు.
2023-24 సీజన్లో రాజస్తాన్ తరఫున విజయ్ మర్చంట్ ట్రోఫీ ద్వారా అండర్-19 క్రికెట్లో అరంగేట్రం చేసిన కుషాగ్ర 2025-26 దేశవాళీ టోర్నీలో అండర్-19 కూచ్ బెహర్ ట్రోఫీలో 565 పరుగులు సాధించి గుర్తింపు పొందాడు. ఈ టోర్నీలోనే రెండు సెంచరీలు సహా నాలుగు హాఫ్సెంచరీలు సాధించాడు. 2026 అండర్-19 వరల్డ్కప్కు కూడా కుషాగ్ర పరిగణలో ఉన్నాడు.


