PC: Sri Lanka Cricket
భారత్ అండర్-19 జట్టుతో రెండో అనధికారిక టెస్టులో శ్రీలంక యువ జట్టు స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. మొదటి ఇన్నింగ్స్లో కేవలం 148 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కాగా రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్- శ్రీలంక అండర్-19 జట్ల మధ్య సోమవారం రెండో యూత్ టెస్టు మొదలైంది.
తొలిరోజే కుశాగ్ర సెంచరీ
కొలంబోలో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో తొలి రోజు ఆట నిలిచే సమయానికి 65 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.ఓపెనర్లు లక్ష్య (0), సాగర్ (0) డకౌట్ కావడంతో... స్కోరు బోర్డు మీద ఒక్క పరుగు చేరకముందే మన జట్టు రెండు వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో కెప్టెన్ యశ్వర్ధన్తో కలిసి వన్డౌన్ బ్యాటర్ కుశాగ్ర ఓజా ఇన్నింగ్స్ను నిర్మించాడు. కుశాగ్ర ఓజా శతకం (177 బంతుల్లో 103 బ్యాటింగ్; 11 ఫోర్లు, 2 సిక్స్లు) సాధించగా... కెప్టెన్ యశ్వర్ధన్ చౌహాన్ (89 బంతుల్లో 78; 11 ఫోర్లు, 2 సిక్స్లు), మనల్ చౌహాన్ (108 బంతుల్లో 55 బ్యాటింగ్; 7 ఫోర్లు) అర్ధసెంచరీలతో మెరిశారు. లంక బౌలర్లను సమర్థంగా అడ్డుకున్న ఈజంట మూడో వికెట్కు 122 పరుగులు జోడించింది.
రెండోరోజు ఆట సాగిందిలా..
అనంతరం కెప్టెన్ అవుట్ కాగా... కుశాగ్రకు మనల్ చౌహాన్ అండగా నిలిచాడు... ఈ జోడీ అబేధ్యమైన నాలుగో వికెట్కు 131 పరుగులు జతచేసింది. ఈ క్రమంలో 253/3 ఓవర్నైట్ స్కోరుతో మంగళవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. 411 పరుగులకు ఆలౌట్ అయింది. ఆట మొదలైన కాసేపటికే కుశాగ్ర (111) అవుట్ కాగా.. మనాల్ చౌహాన్ భారీ శతకం (244 బంతుల్లో 150)తో చెలరేగాడు.
ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో 105.2 ఓవర్లలో భారత్ 411 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన శ్రీలంక.. మంగళవారం ఆట పూర్తయ్యేసరికి 40 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 122 పరుగులు మాత్రమే చేసింది.
148 పరుగులకు ఆలౌట్
ఈ క్రమంలో 122/8 ఓవర్నైట్ స్కోరుతో బుధవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన శ్రీలంక.. కేవలం మరో 26 పరుగులు జతచేసి ఆలౌట్ అయింది. దుల్నిత్ సిగెర 31 పరుగులతో లంక టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. ఓపెనర్ దిమంత మహావితన 24, విరాన్ చముదిత 21, లోయర్ ఆర్డర్లో సెత్మిక సెనెవిరత్నె 25 (నాటౌట్) పరుగులతో ఫర్వాలేదనిపించారు.
మిగిలిన వాళ్లలో అవీష సమాశ్ (9), సెనుజ వెకునగొడ (5), కెప్టెన్ విమత్ దిన్సారా (8), కవిజ గెమాగే (7), వికెట్ కీపర్ బ్యాటర్ జేసన్ ఫెర్నాండో (4), గిమ్హాన్ మెండిస్ (4), విఘ్నేశ్వరన్ ఆకాశ్ (4) పెవిలియన్కు వరుస కట్టారు.
భారత బౌలర్లలో ప్రణవ్ రాఘవేంద్ర, చిగురుపాటి వెంకట, జగన్నాథన్ హేంచుదేశన్, రోహిత్ యాదవ్ తలా రెండు వికెట్లు కూల్చగా.. కావ్యా పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలో 263 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది భారత్.
భారత్కు భారీ ఆధిక్యం
బుధవారం నాటి భోజన విరామ సమయానికి 16 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. ఓపెనర్లలో సాగర్ విర్క్ (17) మరోసారి విఫలం కాగా.. వన్డౌన్లో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ఆర్యన్ సక్పా (6) నిరాశపరిచాడు.
ఓపెనర్ లక్ష్య రాయ్చందాని 31, కెప్టెన్ యశ్వర్దన్ 5 పరుగులతో క్రీజులో నిలిచారు. లంక బౌలర్లలో కవిజ గెమాగే తొలి రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 330 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది.


