రింకూ సింగ్ (PC: BCCI X)
టీమిండియా సెలక్టర్ల తీరుపై భారత మాజీ కెప్టెన్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అర్హత ఉన్న ఆటగాళ్లను జింబాబ్వే సిరీస్కు ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించాడు. ప్రభ్సిమ్రన్ సింగ్ ఒక్కడికే సెలక్టర్లు న్యాయం చేశారని.. కానీ మిగతా ఐపీఎల్ స్టార్లకు మాత్రం అన్యాయం చేశారని చిక్కా విమర్శించాడు.
వరుస పరాజయాల తర్వాత
కాగా ఐర్లాండ్, ఇంగ్లండ్లతో టీ20 సిరీస్లలో వరుసగా 2-0, 4-0తో క్లీన్స్వీప్నకు గురైన టీమిండియా.. తాజాగా జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు టీ20 మ్యాచ్లు ఆడుతుంది. ఈ క్రమంలో గురువారం ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుండగా.. హరారే స్పోర్ట్స్ క్లబ్ ఇందుకు వేదిక.
ఇదిలా ఉంటే.. జింబాబ్వేతో సిరీస్కు సంజూ శాంసన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ (ప్రస్తుతం గాయపడ్డాడు), అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ వంటి సీనియర్లను పక్కనపెట్టారు. రవి బిష్ణోయికి కూడా ముందుగా ఈ జట్టులో చోటు దక్కలేదు. అయితే, ఆ తర్వాత మళ్లీ సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది.
కొత్తగా వీళ్లు
ఇదిలా ఉంటే.. అశోక్ శర్మ, యశ్ ఠాకూర్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక కాగా.. ప్రభ్సిమ్రన్ సింగ్కు కూడా యాజమాన్యం ఈ సిరీస్ ఆడే జట్టులో చోటిచ్చింది. మయాంక్ యాదవ్, హర్ష్ దూబే కూడా జట్టులోకి వచ్చారు.
రింకూ ఎక్కడి నుంచి వచ్చాడు?
ఈ పరిణామాల నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ టీమిండియా యాజమాన్యం వైఖరిని ప్రశ్నించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ప్రభ్సిమ్రన్ సింగ్ను ఎంపిక చేశారు. మంచి సెలక్షన్. కానీ ఆర్సీబీకి వరుసగా రెండుసార్లు టైటిల్ అందించిన రజత్ పాటిదార్ సంగతేంటి?
పాపం.. వాళ్లకు అన్యాయం
అసలు ఈ రింకూ సింగ్ మళ్లీ అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వచ్చాడు? అతడికి బదులు పాటిదార్ను సెలక్ట్ చేసి ఉండాల్సింది. అంతేకాదు.. స్పిన్ విభాగంలో రవి బిష్ణోయి లేదంటే హర్ష్ దూబే స్థానంలో ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన కృనాల్ పాండ్యాను ఎంపిక చేస్తే బాగుండేది.
మీడియం పేసర్లకు బదులు ఆర్సీబీ స్టార్, స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ను ఎంపిక చేస్తే ఇంకా బాగుండేది. అసలు జింబాబ్వేతో సిరీస్కు జట్టును ఈ సెలక్టర్లు ఎలా ఎంపిక చేశారో నాకైతే అర్థం కావడం లేదు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డాడు. నిలకడగా రాణిస్తున్నప్పటికీ.. ఆర్సీబీ ప్లేయర్లకు అన్యాయం చేశారంటూ ఈ మాజీ చీఫ్ సెలక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.


