వెస్టిండీస్ మాజీ ఆల్రౌండర్ కీరన్ పోలార్డ్ టీ20 క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. మాజీ సహచరుడు క్రిస్ గేల్ పేరిట 12 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉండిన రికార్డును అధిగమిస్తూ అత్యధిక పరుగుల వీరుడిగా అవతరించాడు.
మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2026లో భాగంగా ముంబై ఇండియన్స్ న్యూయార్క్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. వాషింగ్టన్ ఫ్రీడంతో జరిగిన మ్యాచ్లో శతకం బాది తన టీ20 పరుగుల సంఖ్యను 14,583కు చేర్చుకున్నాడు. దీంతో అప్పటివరకు టీ20ల్లో అత్యధిక పరుగుల వీరుడిగా చలామణి అయిన గేల్ (14,562 పరుగులు) రికార్డును అధిగమించాడు.
39 ఏళ్ల పొలార్డ్ అంతర్జాతీయ టీ20ల్లో కేవలం 1,569 పరుగులే చేయగా.. మిగతా పరుగులన్నీ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ఫ్రాంచైజీ, దేశీయ టీ20 టోర్నీల్లో సాధించాడు. మరోవైపు గేల్ 2022 తర్వాత పోటీ క్రికెట్కు దూరంగా ఉండటంతో అతని రికార్డు అలాగే నిలిచిపోయింది. 2014 మార్చి నుంచి అత్యధిక టీ20 పరుగుల జాబితాలో గేల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ప్రస్తుతానికి పోలార్డ్ ఈ రికార్డును తన పేరిట బదలాయించుకున్నా, ఇది అతని వద్దే ఎక్కువ కాలం నిలబడేలా లేదు. ఎందుకంటే అతడి వెనువెంటే ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న అలెక్స్ హేల్స్ (14,449), జోస్ బట్లర్ (14,371), డేవిడ్ వార్నర్ (14,284), విరాట్ కోహ్లి (14,218) ఉన్నారు. వీరిలో ముఖ్యంగా విరాట్ కోహ్లికి పోలార్డ్ రికార్డు బద్దలు కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరో ఐపీఎల్ సీజన్ ఆడినా కోహ్లి ఖాతాలో ఈ రికార్డు చేరుతుంది.
మరోవైపు పోలార్డ్ పేరిట టీ20ల్లో అత్యధిక మ్యాచ్లు (736) ఆడిన రికార్డు కూడా ఉంది. ప్రస్తుతం పోలార్డ్ ఆటగాడిగా కొనసాగుతూనే కోచ్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్గా పనిచేసిన అతడు, ఈ ఏడాది పురుషుల హండ్రెడ్ టోర్నీలో MI London జట్టుకు ప్రధాన కోచ్గా వ్యవహరించనున్నాడు.
కాగా, పోలార్డ్ ఈ చారిత్రక ఘనత సాధించిన మ్యాచ్లో అతని జట్టుకు విజయం దక్కలేదు. అతడు శతకం సాధించినా ముంబై ఇండియన్స్ న్యూయార్క్ 30 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫ్రీడం జట్టు.. మిచెల్ ఓవెన్ (155) భారీ శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 245 పరుగులు చేసింది.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో న్యూయార్క్ సైతం పోరాడినా సానుకూల ఫలితం రాలేదు. పోలార్డ్ తన టీ20 కెరీర్లో రెండో శతకం బాది న్యూయార్క్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి 215 పరుగులకే పరిమితమైంది.


