టీ20 క్రికెట్లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ చారిత్రాత్మక మైలురాయిని అందుకున్నాడు. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా బట్లర్ రికార్డులకెక్కాడు. 'ది హండ్రెడ్' టోర్నీలో భాగంగా వేల్ష్ ఫైర్తో జరిగిన మ్యాచ్లో బట్లర్ ఈ ఫీట్ సాధించాడు. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ తరపున ఆడిన బట్లర్ కేవలం 20 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 51 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
23 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బట్లర్ ఈ రికార్డును అందుకున్నాడు. ఈ గుజరాత్ టైటాన్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇప్పటివరకు 522 మ్యాచ్ల్లో 14,833 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ లెజెండ్ కీరన్ పొలార్డ్ పేరిట ఉండేది. పొలార్డ్ 746 మ్యాచ్ల్లో 14,803 పరుగులు చేశాడు.
తాజా మ్యాచ్తో పొలార్డ్ను బట్లర్ అధిగమించాడు. ఈ ఫీట్ సాధించిన అనంతరం బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో తన రికార్డును బద్దలు కొట్టే అవకాశముందని బట్లర్ అన్నాడు.
"టీ20 క్రికెట్లో టాప్ రన్ స్కోరర్గా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఏదో ఒక రోజు నా రికార్డును వేరొకరు బద్దలు కొడతారు. ఆ ఆటగాడు బహుశా వైభవ్ సూర్యవంశీ కావచ్చు. క్రికెట్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. పరిస్థితులు త్వరగా మారుతుంటాయి.
కొన్ని నెలల క్రితం నేను ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డాను. కానీ ఇప్పుడు నాకెరీర్లోనే అత్యుత్తమంగా బ్యాటింగ్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఒడిదొడుకులు ఎదురైనప్పుడు వదిలేయడం లేదా ఫామ్ కోసం కష్టపడడం అనే రెండు మార్గాలే ఉంటాయి. నేను శ్రమించడానికే మొగ్గు చూపాను" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో బట్లర్ పేర్కొన్నాడు.
చదవండి: కళ్లు చెదిరేలా షకీబ్ అల్ హసన్ ఆస్తుల విలువ!


