లైవ్ మ్యాచ్‌.. హఠాత్తుగా పిడుగు; ఫుట్‌బాల‌ర్‌ మృత్యువాత! | Thunderstrom-Lightning-Live-Football-Match-Player-Demise-Thailand | Sakshi
Sakshi News home page

లైవ్ మ్యాచ్‌.. హఠాత్తుగా పిడుగు; ఫుట్‌బాల‌ర్‌ మృత్యువాత!

Aug 6 2026 7:48 AM | Updated on Aug 6 2026 7:53 AM

Thunderstrom-Lightning-Live-Football-Match-Player-Demise-Thailand

పిడుగు పడుతున్న దృశ్యం, ఇన్‌సెట్‌లో మృతి చెందిన సోఫ్వాన్‌ (PC: Twitter)

ద‌క్షిణ థాయ్‌లాండ్‌లో ఫుట్‌బాల్ ఆట‌లో విషాదం నెల‌కొంది. గోలోక్ ఎఫ్ఏ క‌ప్-2026 సెమీఫైన‌ల్ సంద‌ర్భంగా మైదానంలో లైవ్ మ్యాచ్ జ‌రుగుతుండ‌గా, హ‌ఠాత్తుగా మైదానంలో పిడుగు ప‌డింది. ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న‌లో 24 ఏళ్ల ఫుట్‌బాల‌ర్ సోఫ్వాన్ మృతి చెంద‌గా, మ‌రో 12 మంది ఆట‌గాళ్లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. పిడుగుప‌డిన భ‌యాన‌క దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. 

పిడుగుపాటుకు మైదానంలోనే కుప్ప‌కూలిన సోఫ్వాన్‌కు స‌హ‌చ‌ర ఆట‌గాళ్లు, అత్య‌వ‌స‌ర మెడిక‌ల్ బృందం సీపీఆర్ చేసేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ అప్ప‌టికే అత‌డు మ‌ర‌ణించిన‌ట్లు తేలింది. ఇక పిడుగు పాటుకు గాయ‌ప‌డ్డ‌వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఈ ప్రమాదంలో గాయపడిన 12 మంది ఆటగాళ్లలో ఒక మలేషియా క్రీడాకారుడు కూడా ఉన్నాడని, ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని స్థానిక పోలీస్ చీఫ్ థున్ సిరిఖుంట్ తెలిపారు. మరణించిన వింగర్ సొఫ్వాన్ అవాయే ఇటీవలే థాయ్ థర్డ్- టియర్ క్లబ్ అయిన 'యాలా ఎఫ్సీ'కి సైన్ చేశాడు. అతని హఠాన్మరణం పట్ల యాలా ఎఫ్సీ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, అతని కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని ప్రకటించింది. 

ఇక ద‌క్షిణ థాయ్‌లాండ్ స‌రిహ‌ద్దులో జ‌రిగే ఫుట్‌బాల్ టోర్న‌మెంట్ల‌లో అతిపెద్ద టోర్నీ ఇదే. ఈ టోర్నీలో థాయ్‌లాండ్ స‌హా మ‌లేషియా ఆట‌గాళ్లు కూడా త‌ల‌ప‌డుతుంటారు. అయితే మ్యాచ్‌కు ముందు భారీ వ‌ర్షం కురిసిన‌ట్లు తెలుస్తోంది. వ‌ర్షం ఆగిపోవ‌డంతో మ్యాచ్ నిర్వ‌హించామ‌ని, ఇలా హ‌ఠాత్తుగా పిడుగు మైదానంలో ప‌డుతుంద‌ని ఊహించ‌లేక‌పోయామ‌ని, ఎంతో భ‌విష్య‌త్తు ఉన్న సోఫ్వాన్‌ను కోల్పోవ‌డం బాధాక‌ర‌మ‌ని గోలోక్ క్ల‌బ్ నిర్వాహ‌కులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

పిడుగు ప్రమాదాలు కొత్తేమీ కాదు
ఇక థాయ్‌లాండ్‌లో ఇలాంటి పిడుగుపాటు ప్రమాదాలు జరగడం కొత్తేమీ కాదు. డిసీజ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ నివేదిక ప్రకారం.. 2020 నుండి 2024 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 283 మంది పిడుగుపాటుకు గురయ్యారు, వారిలో చాలా మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది మే నెలలోనే లంపాంగ్, ఉథాయ్ థానీ ప్రావిన్సులలో వేర్వేరు ఘటనల్లో పిడుగుపడి గర్భిణి సహా ముగ్గురు మరణించారు. 

Read: టీ20 క్రికెట్‌లో జోస్ బ‌ట్ల‌ర్ ప్ర‌పంచ రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement