సెయింట్ లూయిస్ (అమెరికా): సెయింట్ లూయిస్ గ్రాండ్ చెస్ టూర్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలో ర్యాపిడ్ ఫార్మాట్ ముగిశాక భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద అగ్రస్థానంలో నిలిచాడు. పదిమంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ర్యాపిడ్ గేమ్లు జరిగాయి. చెన్నైకు చెందిన ప్రజ్ఞానంద 12 పాయింట్లతో టాప్ ర్యాంక్లో నిలిచాడు. నాలుగు గేముల్లో గెలిచిన ప్రజ్ఞానంద, మరో నాలుగు గేమ్లను ‘డ్రా’ చేసుకున్నాడు. ఒక గేమ్లో ఓడిపోయాడు. చివరిదైన తొమ్మిదో గేమ్లో ప్రజ్ఞానంద 28 ఎత్తుల్లో జోర్డెన్ వాన్ ఫోరీస్ట్ (నెదర్లా్లండ్స్) చేతిలో ఓటమి పాలయ్యాడు.
అరోనియన్, కీమెర్, కరువానా, లియోంగ్లపై గెలిచిన ప్రజ్ఞానంద... సిందరోవ్, వెస్లీ సో, పెరెజ్, అనీశ్ గిరిలతో గేమ్లను ‘డ్రా’గా ముగించాడు. టోర్నీ నిబంధనల ప్రకారం గేమ్లో గెలిస్తే 2 పాయింట్లు, ‘డ్రా’ చేసుకుంటే ఒక పాయింట్ లభిస్తాయి. బ్లిట్జ్ ఫార్మాట్ను డబుల్ రౌండ్ రాబిన్ లీగ్లో నిర్వహిస్తారు. బ్లిట్జ్ ఈవెంట్లో నిర్ణీత 18 రౌండ్లు ముగిశాక ఓవరాల్గా అత్యధిక పాయింట్లు సాధించిన ప్లేయర్కు టైటిల్ లభిస్తుంది.
ఈ టోర్నీలో ‘క్యాండిడేట్స్’ టోర్నీ విజేత సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్), వెస్లీ సో (అమెరికా), అరోనియన్ (అమెరికా), లీనియర్ పెరెజ్ (అమెరికా), అనీశ్ గిరి (నెదర్లాండ్స్), కీమెర్ (జర్మనీ), కరువానా (అమెరికా), ఫారీస్ట్ (నెదర్లాండ్స్), లియోంగ్ (అమెరికా) పాల్గొంటున్నారు.


