తన్వీ, అన్మోల్ కూడా ముందంజ
సియోల్: కొరియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ లో హైదరాబాద్ అమ్మాయి శ్రియాన్షి వలిశెట్టి శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రియాన్షి 21–15, 21–14తో పాయ్ యు పో (చైనీస్ తైపీ)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. గతవారం తైపీ ఓపెన్ టైటిల్ నెగ్గిన తన్వీ శర్మతోపాటు అన్మోల్ ఖరబ్, అస్మిత చాలిహా, రక్షిత శ్రీ, ఇషారాణి బారువా, మాన్సి సింగ్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.
తొలి రౌండ్ మ్యాచ్ల్లో తన్వీ శర్మ 21–16, 21–15తో యువాన్ అన్ కి (చైనా)పై, అన్మోల్ 16–21, 21–17, 21–12తో లో సిన్ యాన్ (హాంకాంగ్)పై, రక్షిత శ్రీ 22–24, 21–12, 21–13తో యూ ఎ యోన్ (కొరియా)పై, మాన్సి సింగ్ 14–21, 21–17, 21–12తో కిమ్ జూ యున్ (కొరియా)పై, అష్మిత 22–20, 21–18తో రికో హిరామోటో (జపాన్)పై, ఇషారాణి 21–18, 15–21, 21–17తో లీ సో యుల్ (కొరియా)పై విజయం సాధించారు. భారత్కే చెందిన తాన్యా హేమంత్ 16–21, 20–22తో హినా అకెచి (జపాన్) చేతిలో, ఆకర్షి కశ్యప్ 22–20, 21–23, 3–21తో కిమ్ మిన్ జి (కొరియా) చేతిలో ఓడిపోయారు.
శ్రీకాంత్కు నిరాశ
పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్, తరుణ్ మన్నేపల్లి, కిరణ్ జార్జ్, మిథున్ మంజునాథ్, రౌనక్ చౌహాన్, సనీత్ దయానంద్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. శ్రీకాంత్ 20–22, 21–14, 12–21తో డానిల్ దుబోవెంకో (ఇజ్రాయెల్) చేతిలో, తరుణ్ 13–21, 21–12, 19–21తో యూ టె బిన్ (కొరియా) చేతిలో, కిరణ్ 15–21, 9–21తో పార్క్ సాంగ్ యోంగ్ (కొరియా) చేతిలో, మిథున్ 13–21, 21–12, 19–21తో జు జువాన్ చెన్ (చైనా) చేతిలో, రౌనక్ 21–23, 19–21తో జియోన్ హైక్ జిన్ (కొరియా) చేతిలో ఓడిపోయారు. యుడాయ్ ఒకిమోటో (జపాన్)తో జరిగిన మ్యాచ్లో సనీత్ తొలి గేమ్ను 11–21తో కోల్పోయి, రెండో గేమ్లో 4–13తో వెనుకబడిన దశలో గాయంతో వైదొలిగాడు.


