తరుణ్‌ ముందంజ | Tarun makes a good start in Taipei Open World Tour Super 300 badminton tournament | Sakshi
Sakshi News home page

తరుణ్‌ ముందంజ

Jul 30 2026 4:02 AM | Updated on Jul 30 2026 4:02 AM

Tarun makes a good start in Taipei Open World Tour Super 300 badminton tournament

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రణయ్, కిరణ్‌ 

ఉన్నతి, తన్వీ, అన్‌మోల్‌ కూడా  

తైపీ సిటీ: తైపీ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో హైదరాబాద్‌ ప్లేయర్‌ తరుణ్‌ మన్నేపల్లి శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 52వ ర్యాంకర్‌ తరుణ్‌ 21–12, 21–15తో ఎనిమిదో సీడ్, ప్రపంచ 35వ ర్యాంకర్‌ జియోన్‌ హైక్‌ జిన్‌ (దక్షిణ కొరియా)పై గెలుపొంది ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నాడు. 36 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రెండు గేముల్లోనూ తరుణ్‌ పూర్తి ఆధిపత్యం చలాయించాడు.

మరోవైపు భారత్‌కే చెందిన హెచ్‌ఎస్‌ ప్రణయ్, కిరణ్‌ జార్జి కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ప్రణయ్‌ 21–11, 21–14తో మినోరు కోగా (జపాన్‌)పై, కిరణ్‌ జార్జి 21–10, 21–18తో వాఆంగ్‌ పో వె (చైనీస్‌ తైపీ)పై గెలిచారు. అయితే భారత యువ ఆటగాళ్లు రౌనక్‌ చౌహాన్, మిథున్‌ మంజునాథ్, సనీత్‌ దయానంద్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. క్వాలిఫయర్‌ రౌనక్‌ 14–21, 16–21తో రిచీ దుతా రికార్డో (ఇండోనేసియా) చేతిలో, మిథున్‌ 18–21, 4–21తో జేసన్‌ గుణవాన్‌ (హాంకాంగ్‌) చేతిలో, సనీత్‌ 4–21, 21–19, 12–21తో ఇగోన్‌ ఇవీ (మలేసియా) చేతిలో ఓటమి పాలయ్యారు. 

శ్రియాంశి పరాజయం 
మహిళల సింగిల్స్‌లో భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. హైదరాబాద్‌ అమ్మాయి శ్రియాంశి వలిశెట్టితోపాటు ఇషారాణి బారువా, రక్షితశ్రీ,, తస్నిమ్‌ మీర్, అష్మిత చాలిహా తొలి రౌండ్‌లో వెనుదిరగ్గా... ఉన్నతి హుడా, తన్వీ శర్మ, దేవిక సిహాగ్, అన్‌మోల్‌ ఖరబ్, తాన్యా హేమంత్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శ్రియాంశి 11–21, 12–21తో సుపనిద (థాయ్‌లాండ్‌) చేతిలో, తస్నిమ్‌ 16–21, 20–22తో తన్వీ శర్మ చేతిలో, రక్షితశ్రీ 13–21, 22–20, 14–21తో ప్రతివి (ఇండోనేసియా) చేతిలో, అష్మిత 21–16, 14–21, 15–21తో లిన్‌ సియాంగ్‌ టి (చైనీస్‌ తైపీ), ఇషారాణి 8–21, 21–19, 17–21తో చు పిన్‌ చియాన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓటమి చవిచూశారు. 

ఉన్నతి 21–12, 21–18తో వాంగ్‌ పె యు (చైనీస్‌ తైపీ)పై, తాన్యా 21–16, 14–21, 21–16తో వెన్‌ చి సు (చైనీస్‌ తైపీ)పై, దేవిక 14–21, 21–7, 21–15తో పార్క్‌ గా యున్‌ (దక్షిణ కొరియా)పై, అన్‌మోల్‌ 21–15, 11–21, 21–19తో ఇషిక జైస్వాల్‌ (అమెరికా)పై విజయం సాధించారు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో అరిగెల భార్గవ్‌ రామ్‌–గొబ్బూరు విశ్వతేజ్‌ (భారత్‌) జోడీ 21–18, 10–21, 18–21తో చెన్‌ జి యి–ప్రెస్లీ స్మిత్‌ (అమెరికా) జంట చేతిలో ఓడిపోయింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement