ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ ‘డ్రా’ విడుదల
ఈనెల 17 నుంచి 23 వరకు న్యూఢిల్లీలో ఈవెంట్
న్యూఢిల్లీ: స్వదేశంలో తొలిసారి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో ఆడనున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. సెమీఫైనల్ చేరుకొని కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకోవాలంటే సింధు విశేషంగా రాణించాల్సి ఉంటుంది. ఈనెల 17 నుంచి 23 వరకు న్యూఢిల్లీ వేదికగా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ జరగనుంది. ఈ మెగా ఈవెంట్కు సంబంధించిన ‘డ్రా’ వివరాలను బుధవారం విడుదల చేశారు.
మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 2019 ప్రపంచ చాంపియన్, భారత నంబర్వన్ పీవీ సింధు ఐర్లాండ్కు చెందిన ప్రపంచ 141వ ర్యాంకర్ సోఫియా నోబెల్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో సింధు గెలిస్తే రెండో రౌండ్లో స్టెఫానీ స్టొయెవా (బల్గేరియా) లేదా వెన్ యు జాంగ్ (కెనడా)లలో ఒకరితో ఆడుతుంది. ఈ రౌండ్నూ సింధు అధిగమిస్తే ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ వాంగ్ జి యి (చైనా)తో భారత స్టార్ ఆడే అవకాశం ఉంది.
వాంగ్ జి యిని సింధు ఓడిస్తే క్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థిగా ఆరో సీడ్ పుత్రి కుసుమ వర్దని (ఇండోనేసియా) సిద్ధంగా ఉండవచ్చు. కుసుమపై కూడా సింధు విజయం సాధిస్తే సెమీఫైనల్లో ప్రపంచ నంబర్వన్ ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా) రూపంలో అత్యంత క్లిష్టమైన ప్రత్యర్థితో తలపడవచ్చు. ఆన్ సె యంగ్తో ఇప్పటి వరకు ఆడిన 10 సార్లూ సింధు ఓడిపోయింది. మహిళల సింగిల్స్ బరిలో ఉన్న భారత మరో క్రీడాకారిణి ఉన్నతి హుడా తొలి రౌండ్లో మయాన్మార్ ప్లేయర్ థెట్ థుజార్తో ఆడుతుంది.
ప్రపంచ చాంపియన్షిప్లో సింధుకు ఘనమైన రికార్డు ఉంది. తొమ్మిదిసార్లు ప్రపంచ చాంపియన్షిప్లో పాల్గొన్న సింధు 2019లో విశ్వవిజేతగా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ షట్లర్గా రికార్డు నెలకొల్పింది. 2017, 2018లలో ఫైనల్లో ఓడి రన్నరప్గా నిలిచిన సింధు... 2013, 2014లలో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలు గెల్చుకుంది. 2015, 2021, 2025లలో క్వార్టర్ ఫైనల్ చేరిన ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి 2023లో రెండో రౌండ్లో
ఓడిపోయింది.
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ నంబర్వన్ షి యుకీ (చైనా)తో ఆయుశ్ శెట్టి (భారత్) ఆడతాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్లో ఫిలిమోన్ కొలిన్స్ (ఆ్రస్టియా)తో భారత నంబర్వన్ లక్ష్య సేన్ తలపడతాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్కు ప్రపంచ మాజీ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్లాండ్) ఎదురుకావచ్చు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీకి... మిక్స్డ్ డబుల్స్లో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల జంటకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో పౌలా లోపెజ్–లూసియా (స్పెయిన్)లతో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ... మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో జొనాథన్ లాయ్–క్రిస్టల్ లాయ్ (కెనడా)లతో గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ పోటీపడతారు.


