source: X
భారత స్టార్ షట్లర్లకు ప్రతిష్టాత్మక BWF వరల్డ్ ఛాంపియన్షిప్ 2026కు ముందు సీడింగ్ ఖరారైంది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీ.వీ. సింధుకు మహిళల సింగిల్స్లో 9వ సీడ్ లభించింది. స్టార్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టికి 5వ సీడ్ దక్కింది.
ఆగస్టు 17 నుంచి 23 వరకు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ ప్రపంచ ఛాంపియన్షిప్ జరగనుంది. భారత్ ఐదు విభాగాల్లోనూ రెండేసి ఎంట్రీలు నమోదు చేసింది. నాలుగు విభాగాల్లో కనీసం ఒక భారత జోడీ లేదా ఆటగాడికి సీడింగ్ దక్కడం విశేషం.
సింధుకు 9వ సీడ్
ప్రస్తుతం జపాన్ ఓపెన్ ఛాంపియన్గా ఉన్న సింధుకు మహిళల సింగిల్స్లో 9వ సీడ్ ఇచ్చారు. జపాన్కు చెందిన అకానె యమగుచి 2వ సీడ్గా ఉండగా, చైనాకు చెందిన వాంగ్ జి యి, చెన్ యుఫెయ్ వరుసగా 3, 4వ సీడ్లలో ఉన్నారు. క్షిణ కొరియా స్టార్ ఆన్ సె-యంగ్ మహిళల సింగిల్స్లో టాప్ సీడ్గా ఉంది.
సాత్విక్-చిరాగ్కు 5వ సీడ్
భారత స్టార్ జోడీ సాత్విక్-చిరాగ్కు పురుషుల డబుల్స్లో 5వ సీడ్ లభించింది. 2022 ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేతలైన ఈ జోడీపై భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. పురుషుల డబుల్స్లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ వోన్ హో-సియో సియుంగ్ జే టాప్ సీడ్గా ఉన్నారు.
లక్ష్య సేన్కు 14వ సీడ్
భారత యువ స్టార్ లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్లో 14వ సీడ్గా నిలిచాడు. గతంలో ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించిన లక్ష్య.. మరోసారి పతకంపై కన్నేశాడు. పురుషుల సింగిల్స్లో ప్రపంచ ఛాంపియన్ షి యు కీ టాప్ సీడ్గా ఉన్నాడు.
మిక్స్డ్ డబుల్స్లోనూ భారత్కు సీడ్
భారత్కు చెందిన ధ్రువ్ కపిల-తనిషా క్రాస్టో జోడీ మిక్స్డ్ డబుల్స్లో 15వ సీడ్గా నిలిచింది. ఈ విభాగంలో చైనాకు చెందిన ఫెంగ్ యాన్ ఝె-హువాంగ్ డాంగ్ పింగ్ టాప్ సీడ్గా ఉన్నారు. మరోవైపు మహిళల డబుల్స్లో చైనాకు చెందిన లియూ షెంగ్ షు-టాన్ నింగ్ టాప్ సీడ్గా నిలిచారు.
రేపే డ్రా
ప్రపంచ ఛాంపియన్షిప్ డ్రా బుధవారం న్యూఢిల్లీలో జరగనుంది. ఏదైనా సీడ్ ఆటగాడు లేదా జోడీ టోర్నీ నుంచి తప్పుకుంటే సీడింగ్లో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
కాగా, ఆటగాళ్ల అర్హతను ఏప్రిల్ 28, 2026 ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా నిర్ణయించగా.. సీడింగ్ను జూలై 28 ర్యాంకింగ్స్ ఆధారంగా ఖరారు చేశారు.


