అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో బీసీసీఐ మాజీ క్రికెటర్లకు అందించే పెన్షన్ పథకం మరోసారి చర్చలోకి వచ్చింది. 2004లో ప్రారంభమైన ఈ పథకంలో సుమారు 900 మంది మాజీ క్రికెటర్లు, అంపైర్లు, ఇతర అధికారులు ప్రయోజనం పొందుతున్నట్లు సమాచారం.
మొదటల్లో కనీసం ఒక టెస్టు మ్యాచ్ ఆడిన మాజీ క్రికెటర్లకు నెలకు రూ.5,000 పెన్షన్ అందించేవారు. 2022లో బీసీసీఐ పెన్షన్ మొత్తాలను భారీగా పెంచింది. దీంతో సుమారు 900 మంది మాజీ క్రికెటర్లు, అంపైర్లు, అధికారులు లబ్ది పొందారు.
ప్రస్తుతం క్రికెటర్ల నెల పెన్షన్ ఎంత..?
25 లేదా అంతకంటే ఎక్కువ టెస్టులు ఆడిన పురుష క్రికెటర్లు- రూ.70,000
ఇతర మాజీ పురుష టెస్టు క్రికెటర్లు- రూ.60,000
మాజీ మహిళా అంతర్జాతీయ క్రికెటర్లు- రూ.52,500
2003కు ముందు రిటైరైన ఫస్ట్క్లాస్ క్రికెటర్లు- రూ.45,000
ఇతర మాజీ ఫస్ట్క్లాస్ క్రికెటర్లు- రూ.30,000
జీవితాంతం వస్తుందా..?
అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం, పెన్షన్ సాధారణంగా శాశ్వతంగా రద్దు కాదు. అయితే మాజీ క్రికెటర్ లేదా అధికారి బీసీసీఐ లేదా రాష్ట్ర క్రికెట్ సంఘంలో జీతభత్యాలు తీసుకునే పదవిలో చేరితే, ఉదాహరణకు కోచ్, సెలెక్టర్, అడ్మినిస్ట్రేటర్ వంటి బాధ్యతలు చేపడితే, పెన్షన్ చెల్లింపులో తాత్కాలిక విరామం ఉండవచ్చు.
పెన్షన్ పొందుతున్న ప్రముఖ క్రికెటర్లు..?
పెన్షన్ పొందుతున్న మాజీ క్రికెటర్ల జాబితాను బీసీసీఐ అధికారికంగా వెల్లడించలేదు. అయితే అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, పెన్షన్ అర్హత ఉన్న ప్రముఖ మాజీ క్రికెటర్లలో ప్రస్తుతం సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ వంటి వారు ఉంటారు.
అజింక్య రహానేకు ఎంత..?
రహానే భారత్ తరఫున 85 టెస్టులు ఆడాడు. కాబట్టి అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత అత్యధిక రూ.70,000 నెలవారీ పెన్షన్ బ్రాకెట్కు అర్హత పొందుతాడు.


