Photo Credit: BCCI Twitter
జింబాబ్వేతో సిరీస్ అనంతరం టీమిండియా శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 15 నుంచి ఇరుజట్ల మధ్య గాలే వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్లో టీమిండియాకు సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక ఆయుధంగా మారనున్నాడని మాజీ క్రికెటర్ చతేశ్వర్ పుజారా జోస్యం చెప్పాడు.
సంప్రదాయ టెస్టు క్రికెట్లో జడేజా గతంలో పరుగులు కట్టడి చేయడంపైనే దృష్టి సారించేవాడని, కానీ కొన్నాళ్లుగా అతడు వికెట్ల కోసమే బంతులు వేస్తున్నట్లుగా అనిపిస్తోందని తెలిపాడు. జియో హాట్స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుజారా మాట్లాడాడు. 'కెరీర్ ఆరంభంలో జడేజా తన బౌలింగ్లో పరుగులు ఎక్కువగా రాకూడదనే మైండ్సెట్తో ఉండేవాడు. రెడ్బాల్ క్రికెట్లో ఇది చాలా ఎక్కువగా కనిపించేది. అయితే వికెట్ కొద్దిగా సహకరించినా, అతడు వికెట్లు తీయడానికి ప్రయత్నించేవాడు.
కానీ ఇప్పుడు మాత్రం జడేజా పూర్తిగా మారిపోయాడు. తనకున్న బలాబలాలను అర్థం చేసుకొని దానికి అనుగుణంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు అతడు వికెట్లు తీయడంలో నేర్పరి. ఇక జడ్డూ ప్రతి గేమ్లోనూ బంతిని స్టంప్ లైన్లో వేసి ఔట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. గతంలో అతడి ఆలోచన కాస్త రక్షణాత్మక ధోరణిలో ఉండేది. కానీ ఇప్పుడు వికెట్ తీయాలనే ఉద్దేశంతోనే బంతులను విసురుతున్నాడు' అని పుజారా చెప్పుకొచ్చాడు.
ఇక జడేజా ఆరు నెలల తర్వాత టెస్టు జట్టులోకి తిరిగొచ్చాడు. గతేడాది నవంబర్లో గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు ఆడాడు. ఆ మ్యాచ్లో జడేజా ఆరు వికెట్లు పడగొట్టడంతో పాటు అర్ధసెంచరీ సాధించాడు. ఇక 37 ఏళ్ల జడేజాకు శ్రీలంకపై అద్భుతమైన రికార్డు ఉంది. గతంలో లంకతో ఆడిన ఏడు టెస్టుల్లో జడేజా 65 సగటుతో 326 పరుగులు చేశాడు. లంకపైనే అతడి కెరీర్ బెస్ట్ (175 నాటౌట్) స్కోరు నమోదు చేశాడు.
ఇక బౌలింగ్లో 24 సగటుతో 33 వికెట్లు తీశాడు. ఇక లంక గడ్డపై గతంలో ఆడిన రెండు టెస్టులు కలిపి మొత్తం 13 వికెట్లు పడగొట్టాడు. ఇక ఓవరాల్గా జడేజా 85 టెస్టుల్లో 348 వికెట్లు తీశాడు. ఇందులో 15 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలున్నాయి. బ్యాటింగ్లో 4,095 పరుగులు సాధించిన జడేజా ఖతాలో ఆరు సెంచరీలు, 28 అర్ధసెంచరీలున్నాయి.
Read: ‘రొనాల్డోనే స్ఫూర్తి.. నా తండ్రి కూడా అలానే మరణించాడు’


