Photo Credit: BCCI/X
భారత దిగ్గజ బ్యాటర్ వీరేందర్ సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా హెడ్కోచ్గా తనకు గతంలో అవకాశం వచ్చిందని.. అయితే, తనకు స్వేచ్ఛనిస్తేనే ఈ పనిచేస్తానని యాజమాన్యంతో కరాఖండిగా చెప్పినట్లు తెలిపాడు.
కాగా 2017లో టీమిండియా హెడ్కోచ్గా ఉన్న అనిల్ కుంబ్లే, కెప్టెన్గా ఉన్న విరాట్ కోహ్లి మధ్య విభేదాలు వచ్చినట్లు ఊహాగానాలు వినిపించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే కోచ్గా తనకు ఆఫర్ వచ్చిందని సెహ్వాగ్ తాజాగా గుర్తుచేసుకున్నాడు. క్రికెట్నెక్ట్స్తో మాట్లాడుతూ..
వాళ్లిద్దరికి పడట్లేదు
‘‘ఆరోజు బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి, కెప్టెన్ విరాట్ కోహ్లి గనుక నన్ను సంప్రదించకపోయి ఉంటే.. నేను అస్సలు కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసేవాడినే కాదు. అమితాబ్ నాతో అధికారికంగా సమావేశం నిర్వహించాడు. అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లికి పడటం లేదని.. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని చెప్పాడు.
నువ్వు టీమిండియా కోచ్గా రావాలి
అందుకే నేను కోచ్గా రావాలని వారు కోరుకుంటున్నట్లు తెలిపాడు. చాంపియన్స్ ట్రోఫీ 2017 తర్వాత అనిల్ కాంట్రాక్టు ముగిసిపోతుందని.. ఆ వెంటనే వెస్టిండీస్ పర్యటన నుంచి నేను బాధ్యతలు చేపట్టాలని సూచించాడు. అయితే, నేను అప్పుడు యస్ అని గానీ.. నో అని గానీ చెప్పలేదు.
నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు
ఒకవేళ నేను కోచ్గా వస్తే మాత్రం నేను కోరుకున్న సహాయక సిబ్బందినే నియమించాలని చెప్పేవాడిని. అసిస్టెంట్ కోచ్, బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, ఫిజియో, ట్రైనర్.. ఇలా ప్రతి ఒక్కరి విషయంలో నా ఛాయిస్కు ప్రాధాన్యం ఇవ్వాలని కోరేవాడిని. కానీ నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అందుకే నేను వెళ్లలేదు’’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
కాగా 2017 జూన్లో కుంబ్లే హెడ్కోచ్ పదవి నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో సంజయ్ బంగర్ నాడు తాత్కాలిక కోచ్గా వచ్చాడు. ఇక ఆ తర్వాత జూలై 2017 నుంచి 2021 వరకు రవిశాస్త్రి హెడ్కోచ్గా పనిచేశాడు.
ఇక రవిశాస్త్రి- కోహ్లి నేతృత్వంలో టెస్టు ఫార్మాట్లో టీమిండియా మంచి విజయాలు అందుకుంది. ఇదిలా ఉంటే.. భారత విధ్వంసకర ఓపెనర్గా పేరొందిన సెహ్వాగ్.. టెస్టుల్లో 8586, వన్డేల్లో 8273, టీ20లలో 394 పరుగులు సాధించాడు.


