శ్రీలంక పర్యటనను పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు విజయంతో ముగించింది. ఇరుజట్ల మధ్య మంగళవారం జరిగిన ఆఖరి టీ20లో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. కాగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడేందుకు పాక్ మహిళా జట్టు లంక పర్యటనకు వెళ్లింది.
తొలుత వన్డే సిరీస్ జరుగగా.. తొలి మ్యాచ్లో పాక్ విజయం సాధించింది. అయితే, ఆ తర్వాత ఆతిథ్య లంక మహిళా జట్టు మిగిలిన రెండు వన్డేలు గెలిచి సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. అనంతరం టీ20 సిరీస్లో భాగంగా తొలి రెండు మ్యాచ్లలో లంక విజయం సాధించింది.
పరువు కోసం పాక్ పోరాటం
తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్ను సైతం కైవసం చేసుకుంది. ఈ క్రమంలో నామమాత్రపు మూడో టీ20లో గెలిచి క్లీన్స్వీప్ చేయాలని లంక భావించగా.. పాక్ పరువు చేసిన పోరాటంలో విజయం సాధించింది. దంబుల్లా వేదికగా టాస్ గెలిచిన పాక్ మహిళా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 113 పరుగులు మాత్రమే చేసింది. టాపార్డర్లో ఓపెనర్లలో ఇమేషా దులాని (17) నిరాశపరచగా.. కెప్టెన్ చమరి ఆటపట్టు 34 పరుగులతో రాణించింది. వన్డౌన్ బ్యాటర్ సంజనా కవింది 20 పరుగులతో ఫర్వాలేదనిపించింది.
నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది..
మిగిలిన వాళ్లలో కవిశా దిల్హరి (12), కౌశాని నూత్యాంగన (12), కావ్యా కవింది (10 నాటౌట్) మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు. పాక్ బౌలర్లలో మొమినా రియాసత్ రెండు వికెట్లు తీయగా.. ఉమ్ ఈ హనీ, నష్రా సంధు, తూబా హసన్, ఆయేషా జాఫర్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాక్ 18.2 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 115 పరుగులు సాధించింది. తద్వారా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది.. క్లీన్స్వీప్ గండం నుంచి బయటపడింది. పాక్ ఓపెనర్ షవాల్ జుల్ఫికర్ 21, ఆయేషా జాఫర్ 39 పరుగులతో రాణించారు. లంక బౌలర్లలో చమరి ఆటపట్టు, కవిశా దిల్హరి చెరో రెండు వికెట్లు తీయగా.. మిమాష మీపగే ఒక వికెట్ పడగొట్టింది.


