ఇంగ్లండ్ పర్యటనకు ముందు పాకిస్తాన్ క్రికెట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు బ్యాటింగ్ కోచ్గా దక్షణాఫ్రికా మాజీ క్రికెటర్ మైఖేల్ స్మిత్ను పీసీబీ నియమించింది. అతడితో రెండేళ్ల కాలానికి గాను పీసీబీ ఒప్పందం కుదుర్చుకుంది.
స్మిత్ మూడు ఫార్మాట్లలోనూ పాక్ జట్టు బ్యాటింగ్ కోచ్గా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం పాక్ జట్టు తాత్కాలిక బ్యాటింగ్ కోచ్గా నేషనల్ సెలెక్టర్ అసద్ షఫీక్ సేవలు అందిస్తున్నాడు. అయితే ఇప్పుడు అతడి స్ధానంలో ఫుల్-టైమ్ కోచ్గా 46 ఏళ్ల స్మిత్ బాధ్యతలు చేపట్టనున్నాడు.
ఎవరీ మైఖేల్ స్మిత్?
స్మిత్కు అంతర్జాతీయ క్రికెట్లో ఆడిన అనుభవం ఎక్కువగా లేకపోయినప్పటికి.. దేశవాళీ క్రికెట్లో మాత్రం అతడికి అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. 2003 నుంచి 2013 మధ్య కాలంలో అతడు ఫస్ట్-క్లాస్, లిస్ట్-ఎ, టీ20 ఫార్మాట్లలో 175కి పైగా మ్యాచ్లు ఆడి 7,000 పైగా పరుగులు చేశారు.
కోచ్గా కూడా అతడు విజయవంతమయ్యాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఇస్లామాబాద్ యునైటెడ్, కరాచీ కింగ్స్ జట్లకు కోచింగ్ స్టాప్లో స్మిత్ భాగమయ్యాడు. అదేవిధంగా ఆస్ట్రేలియాకు చెందిన హోబర్ట్ హరికేన్స్, క్రికెట్ టాస్మేనియా జట్లకు బ్యాటింగ్ కోచ్గా అతడు పని చేశాడు.
కాగా ప్రస్తుతం విండీస్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడుతున్న పాక్ జట్టు.. అటు నుంచి అటు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఇంగ్లీష్ జట్టుతో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో బాబర్ సేన తలపడనుంది. ఈ సిరీస్ ఆగస్టు 19 నుంచి ప్రారంభం కానుంది.


