పాకిస్తాన్ టీ20 కెప్టెన్గా స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం మళ్లీ బాధ్యతలు చేపట్టనున్నాడా? అంటే అవునానే సమధానమే ఎక్కువగా వినిపిస్తోంది. ప్రస్తుత టీ20 కెప్టెన్గా ఉన్న సల్మాన్ అలీపై వేటు వేసి తిరిగి బాబర్కు జట్టు పగ్గాలను అప్పగించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్దమైనట్లు సమాచారం.
పాక్ టీ20 కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించడం ఇది మూడోసారి కానుంది. పీసీబీ ఇటీవలే పాక్ టెస్ట్ కెప్టెన్గా బాబర్ ఆజంను తిరిగి నియమించిన సంగతి తెలిసిందే. బాబర్ వెస్టిండీస్ టూర్ నుంచి మరోసారి పాక్ టెస్టు జట్టు సారధిగా తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు.
ఇప్పుడు టీ20ల్లో కూడా జట్టును నడిపించేందుకు ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ సిద్దమయ్యాడు. బాబర్ ఆజం 2020-2023 అన్ని ఫార్మాట్లలో పాక్ జట్టుకు నాయకత్వం వహించాడు. అతడి సారథ్యంలో పాకిస్తాన్ 2021 టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్స్కు చేరుకుంది. ఆ తర్వాత 2023 వన్డే ప్రపంచ కప్లో ఘోర పరాజయం తర్వాత పాక్ కెప్టెన్సీ నుంచి అతడు వైదొలిగాడు.
కానీ అనుహ్యంగా మళ్లీ టీ20 ప్రపంచకప్-2024లో పాక్ జట్టు పగ్గాలను బాబర్ చేపట్టనున్నాడు. అక్కడ కూడా కెప్టెన్గా, ఆటగాడిగా బాబర్ విఫలమయ్యాడు. దీంతో అతడిని పక్కన పెట్టి సల్మాన్ అలీ అఘాను కొత్త కెప్టెన్గా పీసీబీ నియమించింది. అతడు కూడా జట్టును విజయపథంలో నడిపించలేకపోయాడు.
అఘా నాయకత్వంలో పాక్ ఆసియాకప్-2025 ఫైనల్కు చేరినప్పటికి.. టీ20 ప్రపంచకప్లో మాత్రం దారుణంగా విఫలమైంది. సూపర్ 8 దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలోనే అతడిపై కూడా వేటు వేయాలని పీసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.


