ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) పాకిస్తాన్కు షాకిచ్చింది. సమ్మర్లో పాక్తో ఆడాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ను ఈసీబీ రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్-2027కు ముందు ఈసీబీ.. ఇంగ్లండ్- పాకిస్తాన్ మధ్య ఏకైక టెస్టు నిర్వహించాలని నిర్ణయించింది.
యూటర్న్
ఈ విషయమై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB)తో కూడా చర్చించినట్లు సమాచారం. అయితే, ఈసీబీ తాజాగా యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ను కాదని బంగ్లాదేశ్తో ఈ ఏకైక టెస్టు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
‘ది టెలిగ్రాఫ్’ కథనం ప్రకారం.. వచ్చే ఏడాది మే నెలలో ఇంగ్లండ్- బంగ్లాదేశ్ మధ్య టెస్టు నిర్వహణకు ఈసీబీ ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇందుకు సంబంధించిన వేదికను మాత్రం ఇంకా నిర్ణయించలేదు.
ఒప్పందం ప్రకారం..
కాగా మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (MCC)తో ఈసీబీకి ఓ ఒప్పందం ఉంది. దీని ప్రకారం.. ప్రతీ ఏడాది వేసవిలో లార్డ్స్ వేదికగా రెండు టెస్టు మ్యాచ్లు నిర్వహించాల్సి ఉంటుంది. ఇక ఈసారి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 ఫైనల్ వేదికను లార్డ్స్ నుంచి తరలిస్తున్న విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్కు బంపరాఫర్
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్తో నిర్వహించే టెస్టుకు లార్డ్స్ను వేదికగా ఎంపిక చేయాలనే యోచనలో ఈసీబీ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే బంగ్లాదేశ్కు బంపరాఫర్ వచ్చినట్లే!.. బంగ్లా జట్టు చివరగా 2010లో ఇంగ్లండ్లో పర్యటించింది. తాజాగా మరోసారి ఏకైక టెస్టు కోసం ఇంగ్లండ్కు వెళ్లనుంది.
నిజానికి పాకిస్తాన్తో నిర్వహించాలనుకున్న ఏకైక టెస్టుకు ఈసీబీ మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానాన్ని వేదికగా ఎంపిక చేసింది. అయితే, తాజా నిర్ణయం నేపథ్యంలో బంగ్లాకు చారిత్రాత్మక లార్డ్స్లో టెస్టు ఆడే అవకాశం రానుంది. ఇక ఇప్పటి వరకు ఇంగ్లండ్- బంగ్లాదేశ్ మధ్య ఐదు టెస్టు సిరీస్లు జరిగాయి. అయితే, సొంతగడ్డపై ఒకే ఒక్క మ్యాచ్లో బంగ్లా.. ఇంగ్లండ్ను టెస్టు మ్యాచ్లో ఓడించగలిగింది.
పాకిస్తాన్కు ఊరట
అయితే, ఈసీబీ పాకిస్తాన్కు ఓ ఊరట కూడా ఇచ్చింది. ఈ ఏడాది ఆగష్టులో పాకిస్తాన్ ఇంగ్లండ్ పర్యటన యథావిధిగా కొనసాగుతుందని తెలిపింది. ఇందులో భాగంగా హెడింగ్లీ, లార్డ్స్, ఎడ్జ్బాస్టన్ వేదికలుగా ఇరుజట్ల మధ్య ఆగష్టు 19 నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది. కాగా 2020 తర్వాత పాకిస్తాన్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. నాడు అజర్ అలీ కెప్టెన్సీలో ఇంగ్లండ్తో మూడు టెస్టులు ఆడిన పాకిస్తాన్.. బాబర్ ఆజం సారథ్యంలో మూడు టీ20 మ్యాచ్లు ఆడింది.


