చైనా ఓపెన్ సూపర్-1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భారత యువ సంచలనం ఉన్నతి హుడాపై 21-14, 9-21, 21-10 తేడాతో సింధు విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ సింధుకు ఉన్నతి నుంచి గట్టి పోటీ ఎదురైంది. తొలి గేమ్ ఆరంభంలో ఉన్నతి 7-7తో సమంగా నిలిచింది. అయితే సింధు వరుసగా పాయింట్లు సాధించి సింధు 21-14తో గేమ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత రెండో గేమ్లో ఉన్నతి అద్భుత ప్రదర్శన చేస్తూ 21-9తో గేమ్ను గెలుచుకుని మ్యాచ్ను సమం చేసింది.
ఇక నిర్ణయాత్మక మూడో గేమ్లో తెలుగు తేజం సింధు సత్తాచాటింది. సింధు ఆరంభం నుంచే ఆధిక్యం ప్రదర్శించి, 21-10తో గేమ్తో పాటు మ్యాచ్ను చేజిక్కించుకుంది. ప్రి-క్వార్టర్స్లో (రౌండ్ ఆఫ్ 16) నాలుగో సీడ్, చైనా స్టార్ ఆటగాడు చెన్ యుఫీతో సింధు తలపడనుంది.
మరోవైపు భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి కూడా ప్రి-క్వార్టర్స్కు అర్హత సాధించాడు. తొలి రౌండ్లో ఇండోనేషియాకు చెందిన అల్వి ఫర్హాన్పై 17-21, 21-5, 21-17 తేడాతో ఆయుష్ గెలుపొందాడు. అయితే డబుల్స్ విభాగాల్లో భారత షట్లర్లకు తొలి రౌండ్లోనే నిరాశ ఎదురైంది. హరిహరన్ అమశకరుణన్ - ఎం.ఆర్. అర్జున్ జోడీ, రోహన్ కపూర్-గద్దె రుత్విక శివాని ద్వయం ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు.


