వైభవ్‌నే పక్కనపెడతారా?: భారత మాజీ క్రికెటర్‌ ఫైర్‌ | You told Vaibhav serve water He Should: Ex India star slams management | Sakshi
Sakshi News home page

అతడితో నీళ్ల బాటిళ్లు మోయిస్తారా?: భారత మాజీ క్రికెటర్‌ ఫైర్‌

Aug 5 2026 12:07 PM | Updated on Aug 5 2026 1:08 PM

You told Vaibhav serve water He Should: Ex India star slams management

PC: BCCI X

టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. యువ ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ అరంగేట్రం విషయంలో మేనేజ్‌మెంట్‌ వ్యవహరించిన తీరు సరికాదని విమర్శించాడు. ఈ పిల్లాడిని ఐర్లాండ్‌పై గడ్డపై ఆడిస్తే ఫలితం వేరుగా ఉండేదని అభిప్రాయపడ్డాడు.

కాగా ఐపీఎల్‌, భారత అండర్‌-19 జట్టు తరఫున అదరగొట్టిన వైభవ్‌ సూర్యవంశీని టీమిండియా సెలక్టర్లు యూకే పర్యటనకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత ఐర్లాండ్‌, ఆ తర్వాత ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లు ఆడింది భారత జట్టు.

సంజూ వరుస వైఫల్యాలు
అయితే, ఐర్లాండ్‌లో సంజూ శాంసన్‌- అభిషేక్‌ శర్మను ఓపెనింగ్‌ జోడీగా కొనసాగించిన యాజమాన్యం.. వైభవ్‌ను బెంచ్‌కే పరిమితం చేసింది. ఈ సిరీస్‌లో భారత జట్టు ఐర్లాండ్‌ చేతిలో 2-0తో వైట్‌వాష్‌ అయింది. ఇక సంజూ ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌లలోనూ తేలిపోయాడు.

అరంగేట్రంలో తేలిపోయిన వైభవ్‌
అనంతరం ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ సంజూ విఫలం కావడంతో.. ఎట్టకేలకు వైభవ్‌కు రెండో టీ20 సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. అయితే, పదిహేనేళ్ల ఈ బిహారీ పిల్లాడు.. తొలి మ్యాచ్‌లో కేవలం 13 పరుగులే చేశాడు. ఆ తర్వాత 15,14 పరుగులకే నిష్క్రమించాడు.

జింబాబ్వే గడ్డ మీద దూకుడు
దీంతో ఇంగ్లండ్‌తో ఐదో టీ20 నుంచి వైభవ్‌ను తప్పించి మరోసారి సంజూకే అవకాశమిచ్చారు. అయితే, జింబాబ్వేతో టీ20 సిరీస్‌ నుంచి సంజూకు విశ్రాంతినివ్వగా.. వైభవ్‌కు మళ్లీ ఓపెనింగ్‌ చేసే అవకాశం వచ్చింది. ఈ సిరీస్‌లో భాగంగా ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. 50, 20, 81 పరుగులు సాధించాడు.

జింబాబ్వేను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేయడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు అందుకున్నాడు వైభవ్‌ సూర్యవంశీ. ఈ నేపథ్యంలో మహ్మద్‌ కైఫ్‌ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఎక్స్‌ ఫ్యాక్టర్‌ ప్లేయర్‌
‘‘వైభవ్‌ ఎక్స్‌ ఫ్యాక్టర్‌ ప్లేయర్‌. చిన్న వయసులోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. ఐపీఎల్‌లో అతడి సత్తా ఏమిటో అంతా చూశారు. వరుస మ్యాచ్‌లలో అదరగొట్టి ఏకంగా ఆరెంజ్‌క్యాప్‌ గెలుచుకున్నాడు.

నిజానికి ఐర్లాండ్‌లోనే అతడి అరంగేట్రం జరగాల్సింది. అప్పుడే అతడు నిర్భయంగా ఇంగ్లండ్‌ గడ్డ మీద అడుగుపెట్టి.. అక్కడా రాణించేవాడు. కానీ మేనేజ్‌మెంట్‌ ఏం చేసింది. ఆరెంజ్‌ క్యాప్‌ విన్నర్‌ను ఐర్లాండ్‌లో పక్కనపెట్టి.. నీళ్ల బాటిళ్లు మోయమని బెంచ్‌కే పరిమితం చేసింది.

వైభవ్‌ ఒక ప్రత్యేకమైన ఆటగాడు. అతడిని మీరు ఐర్లాండ్‌లోనే ఆడిస్తే.. గొప్పగా ఉండేది. ఇంగ్లండ్‌లో అతడు స్వేచ్ఛగా బ్యాట్‌ ఝులిపించేవాడు. కానీ ఇంగ్లండ్‌లో అతడు తేలిపోయాడు. దీంతో మళ్లీ తుదిజట్టు నుంచి అతడిని తప్పించారు.

అతడినే పక్కనపెడతారా?
జోఫ్రా ఆర్చర్‌కు వైభవ్‌ ఆట తీరు తెలుసు కాబట్టి అతడిని సులువుగానే అవుట్‌ చేయగలిగాడు. ఏదేమైనా వైభవ్‌ సూర్యవంశీ టీమిండియా తరఫున మున్ముందు అదరగొట్టడం ఖాయం. కానీ ఆరంభమే ఇంకాస్త సులువుగా ఉంటే బాగుండేది.

అతడొక స్పెషల్‌ టాలెంట్‌. అతడిని తుదిజట్టు నుంచి తప్పించి ప్రయోగాలు చేయొద్దు. జింబాబ్వే మీద అతడు ఎలా ఆడాడో చూశారు కదా!.. ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు కూడా గెలుచుకున్నాడు’’ అని మహ్మద్‌ కైఫ్‌ మేనేజ్‌మెంట్‌ తీరుపై విమర్శలు గుప్పించాడు.

చదవండి: సన్‌రైజర్స్‌ బ్యాటర్ల విధ్వంసం.. 100 బంతుల్లోనే 241 రన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement