పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ పూర్తి ఆధిపత్యం సాధించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ తమ రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు కోల్పోయి కేవలం 103 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం ఆతిథ్య జట్టు 60 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది.
క్రీజులో ఉన్న జస్టిన్ గ్రీవ్స్ వికెట్ను పాక్ బౌలర్లు పడగొడితే విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్ను త్వరగా ముగించవచ్చు. అంతకుముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 387 పరుగులు చేసింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (160) భారీ సెంచరీకి తోడు బాబర్ ఆజమ్ (88), అజాన్ అవైస్ (55) అర్ధ శతకాలతో రాణించారు.
అయితే ఓ దశలో పాక్ జట్టు భారీ స్కోర్ సాధించేలా కనిపించింది. కానీ మిడిలార్డర్ బ్యాటర్లు విఫలం కావడంతో 400 పరుగుల మార్క్ను పర్యాటక జట్టు దాటలేకపోయింది. మొదటి ఇన్నింగ్స్లో పాక్కు 43 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం 43 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన విండీస్కు పాక్ బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు.
ముఖ్యంగా స్పిన్నర్ సాజిద్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టి విండీస్ టాపార్డర్ను దెబ్బ తీశాడు. అదేవిధంగా ఓపెనర్ బ్రాండెన్ కింగ్ తొడ కండరాల గాయం బారిన పడడంతో అతడు ఇంకా సెకెండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ రాలేదు. అతడు తిరిగి బ్యాటింగ్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. కాగా వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 344 పరుగులు చేసింది. కానీ రెండో ఇన్నింగ్స్లో మాత్రం ఆతిథ్య జట్టు బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
చదవండి: క్రికెట్ జట్టు యజమానిగా జహీర్ ఖాన్


