source: X
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్కు మరోసారి టెస్టు సెంచరీ అందని ద్రాక్షగానే మిగిలింది. వెస్టిండీస్తో జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక రెండో టెస్టులో అతడు 88 పరుగుల వద్ద రనౌట్గా వెనుదిరిగాడు. సెంచరీకి చేరువలో ఉండగా రనౌట్ కావడంతో బాబర్ తీవ్ర అసహనానికి గురయ్యాడు.
మూడో రోజు తొలి ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే వారికన్ సంధించిన బంతిని ఆఫ్సైడ్ వైపు ఆడిన బాబర్ సింగిల్ కోసం పరుగు ప్రారంభించాడు. పిచ్ మధ్యలోకి వచ్చిన తర్వాత నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉన్న అబ్దుల్లా షఫీక్ నుంచి తిరిగి వెళ్లాలన్న సంకేతం రావడంతో వెనక్కి మళ్లాడు. అప్పటికే ఆలస్యమైంది.
బ్రాండన్ కింగ్ అద్భుతమైన డైరెక్ట్ హిట్తో బాబర్ను రనౌట్ చేశాడు. దీంతో 147 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్తో 88 పరుగులు చేసిన అతడు పెవిలియన్కు చేరాల్సి వచ్చింది. రనౌట్ తర్వాత బాబర్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశాడు. పెవిలియన్కు వెళ్లే సమయంలో చాలా కోపంగా ఉన్నట్లు కనిపించింది.
మూడున్నరేళ్లుగా ఎదురుచూపులు
బాబర్ చివరిసారిగా 2022 డిసెంబర్లో టెస్టు సెంచరీ చేశాడు. న్యూజిలాండ్తో కరాచీలో జరిగిన టెస్టులో అతడు అద్భుతంగా ఆడి 161 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో అతడు సెంచరీ చేసుంటే 10వ టెస్ట్ సెంచరీ అయ్యేది.
మ్యాచ్ విషయానికొస్తే.. మూడో రోజు బాబర్ ఔటయ్యాక పాక్ స్వల్ప వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. రెండో రోజే సెంచరీ పూర్తి చేసిన అబ్దుల్లా షఫీక్ (130), సాజిద్ ఖాన్ (8) క్రీజ్లో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు స్కోర్ 323-6గా ఉంది.
విండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 21 పరుగులు వెనుకపడి ఉంది. తొలి ఇన్నింగ్స్లో విండీస్ 344 పరుగులకు ఆలౌటైంది. జస్టిన్ గ్రీవ్స్ (73), రోస్టన్ ఛేజ్ (70) అర్ద సెంచరీలతో రాణించారు. ఈ సిరీస్లోని తొలి టెస్ట్ గెలిచిన విండీస్ 1-0 ఆధిక్యంలో ఉంది.


