టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ వ్యాపార రంగంలో మరో కీలక అడుగు వేశాడు. లంక ప్రీమియర్ లీగ్ (LPL) చరిత్రలోనే అత్యంత విజయవంతమైన 'జాఫ్నా కింగ్స్' జట్టు సహ యజమానిగా జహీర్ మారాడు. కాగా జాఫ్నా కింగ్స్ ఫ్రాంచైజీ వ్యవహారం ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైంది.
మొన్నటి వరకు ఈ ఫ్రాంచైజీ ఓనర్గా 'స్పోర్ట్స్ కమ్యూన్' సంస్థ ఉండేది. ఇందులో వాటాను భారత మాజీ అండర్-19 క్రికెటర్ మంజోత్ కాల్రా కొనుగోలు చేసి కో-ఓనర్గా మారాడు. అయితే ఎల్పీఎల్-2026 ప్రారంభమైన కొద్ది రోజులకే మంజోత్ కాల్రాను మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై శ్రీలంక స్పోర్ట్స్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ అరెస్ట్ చేసింది. అదేవిధంగా స్పోర్ట్స్ కమ్యూన్ సంస్థ కూడా ఆర్థికంగా దివాలా తీసింది.
ఆటగాళ్లకు వేతనాలు ఇవ్వడం కూడా కష్టంగా మారింది. ఈ వివాదాల నేపథ్యంలో పాత యాజమాన్యాన్ని తొలగించి, కొత్త వారికి ఫ్రాంచైజీ హక్కులను కట్టబెట్టాలని లంక క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఈ క్రమంలోనే జాఫ్నా జట్టును యాంకర్ స్పోర్ట్స్ సొంతం చేసుకుంది. అందులో వాటాను జహీర్ ఖాన్ కొనుగోలు చేశాడు.
ఇకపై ఈ జట్టును యాంకర్ జాఫ్నా కింగ్స్ అని పిలవనున్నారు. కాగా యాంకర్ స్పోర్ట్స్ సంస్థకు ఇప్పటికే యూరోపియన్ T20 ప్రీమియర్ లీగ్లో 'యాంట్వెర్ప్ యాంకర్స్', కెనడా సూపర్స్ 60 లీగ్లో వాంకోవర్ యాంకర్స్ జట్లు ఉన్నాయి. యాంట్వెర్ప్ యాంకర్స్ ఫ్రాంచైజీలో కూడా జహీర్ ఖాన్ భాగస్వామిగా ఉన్నాడు.
చదవండి: సన్రైజర్స్ బ్యాటర్ల విధ్వంసం.. 100 బంతుల్లో 241 రన్స్


