PC: X
ఫిక్సింగ్ వివాదంపై భారత అండర్-19 జట్టు మాజీ క్రికెటర్, లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్) ఫ్రాంచైజీ జాఫ్నా కింగ్స్ సహ యజమాని మన్జోత్ కల్రా స్పందించాడు. తాను నిర్దోషినని.. తనను కావాలనే కుట్రపూరితంగా ఇరికించే ప్రయత్నం జరిగిందని వాపోయాడు. ప్రసుతం కేసు విచారణలో ఉన్నందున.. తాను దర్యాప్తు అధికారులకు పూర్తిగా సహకారం అందిస్తానని స్పష్టం చేశాడు.
అదే సమయంలో నిజమైన దోషులకు శిక్ష పడుతుందనే నమ్మకం తనకు ఉందని కల్రా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. తాను అవినీతికి పాల్పడ్డట్లు ఆధారాలు లేవని.. తమ న్యాయవాద బృందం తనను నిర్దోషిగా నిరూపించేందుకు కృషి చేస్తోందని తెలిపాడు.
తనను ఫిక్సింగ్లో ఇరికించిన నిజమైన దోషులు త్వరలోనే బయటకు వస్తారని.. అంతిమంగా సత్యమే విజయం సాధిస్తుందని పేర్కొన్నాడు. ఈ మేరకు కల్రా తరఫున అతడి టీమ్ ప్రకటన విడుదల చేసింది.
అరెస్టు చేసిన అధికారులు
కాగా మన్జోత్ కల్రాను... శ్రీలంక క్రీడా అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం నాటి ఎల్పీఎల్ ఆరో సీజన్ ప్రారంభానికి ముందు ఓ ఆటగాడికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన ఆరోపణలపై అధికారులు అతడిని అదుపులోకి తీసుకొని.. కొలంబో న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. ఈనెల 31 వరకు కల్రాకు రిమాండ్ విధించారు.
ఎల్పీఎల్తో సంబంధం ఉన్న ఓ ఆటగాడిని డబ్బుతో ప్రలోభపెట్టడానికి ప్రయత్నించినట్లు కల్రాపై ఆరోపణలు వచ్చాయి. టోర్నీ ఆరంభానికి పది రోజుల ముందు నుంచే ఆ ప్లేయర్ను మన్జోత్ మభ్యపెడుతూ ఉండగా... అతడు అధికారులను అప్రమత్తం చేయడంతో శుక్రవారం కల్రాను అధికారులు అరెస్ట్ చేశారు.
జాఫ్నా కింగ్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీలంక క్రికెటర్లు భానుక రాజపక్స, అవిష్క ఫెర్నాండో, దునిత్ వెల్లలాగే కల్రాపై ఫిర్యాదు చేసినట్లు శ్రీలంక పోలీసులు వెల్లడించారు.
నాడు ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’గా నిలిచి...
న్యూజిలాండ్ ఆతిథ్యమిచ్చిన 2018 అండర్–19 ప్రపంచకప్లో శుబ్మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్ష్దీప్ సింగ్, పృథ్వీ షా, రియాన్ పరాగ్లతో కలిసి మన్జోత్ కల్రా ఆడాడు. ఆస్ట్రేలియా జరిగిన ఫైనల్లో కల్రా అజేయ సెంచరీతో జట్టును గెలిపించి ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డు గెల్చుకున్నాడు. 2018 ఐపీఎల్ వేలంలో ఢిల్లీ డేర్డెవిల్స్ కల్రాను కొనుగోలు చేసింది.
తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో
అయితే అతనికి ఐపీఎల్ మ్యాచ్ ఆడే అవకాశం లభించలేదు. 2019లో కల్రా అసలు వయసును దాచి తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలు సమర్పించి అండర్–19 ప్రపంచకప్లో ఆడాడని విచారణలో తేలింది.
దాంతో 2020లో ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) కల్రాపై రెండేళ్లపాటు నిషేధం విధించింది. అయితే ఈ నిషేధాన్ని తర్వాత ఎత్తి వేసినా సీనియర్ స్థాయిలో కల్రా కెరీర్ ఆశించిన స్థాయిలో సాగలేదు. దాంతో అతడు వ్యాపార రంగంపై దృష్టి పెట్టాడు.
ఇది కొత్తేం కాదు
ఈ ఏడాది ఆరంభంలోనే జాఫ్నా కింగ్స్ ఫ్రాంచైజీలో వాటా కొనుగోలు చేశాడు. అయితే, ఈ ఫ్రాంఛైజీలో కల్రా వాటా అతి తక్కువ అని తాజా ప్రకటనలో అతడి టీమ్ పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఎల్పీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ వార్తలు రావడం ఇది కొత్తేం కాదు. ఈ ఏడాది ఆరంభంలో ఆటగాళ్లను బెట్టింగ్ వైపు పురిగొల్పిన ఓ ఫ్రాంచైజీ యజమానిపై లంక కోర్టు నాలుగేళ్ల నిషేధం విధించింది.


